కోహ్లి, ఇషాన్‌ ఇద్దరూ ఒకేవైపు.. ఏం జరిగిందో చూడండి..! | Sakshi
Sakshi News home page

IND VS NZ 3rd ODI: కోహ్లి, ఇషాన్‌ ఇద్దరూ ఒకేవైపు.. ఏం జరిగిందో చూడండి..!

Published Tue, Jan 24 2023 6:21 PM

IND VS NZ 3rd ODI: Confusion Between Kohli And Ishan As Wicketkeeper Sacrifices Wicket - Sakshi

ఇండోర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పరుగు కోసం టీమిండియా బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, ఇషాన్‌ కిషన్‌ ఒకేవైపు పరిగెత్తారు. ఫలితంగా ఇషాన్‌ కిషన్‌ రనౌటయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (85 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్‌మన్‌ గిల్‌ (78 బంతుల్లో 112; 13 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు సెంచరీలు చేసి వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరారు.

ఆతర్వాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్‌ కోహ్లి (27 బంతుల్లో 36; 3 ఫోర్లు, సిక్స్‌), ఇషాన్‌ కిషన్‌ (24 బంతుల్లో 17; ఫోర్‌, సిక్స్‌) సైతం బ్యాట్‌ ఝులిపిస్తున్నారు. ఇన్నింగ్స్‌ 35వ ఓవర్‌ మూడో బంతికి ఇషాన్‌ కవర్స్‌ దిశగా బంతిని ఆడి పరుగు కోసం కోహ్లికి పిలుపునిచ్చాడు. ఇందుకు కోహ్లి వెంటనే రియాక్ట్‌ అయ్యాడు. అయితే ఇషాన్‌ క్రీజ్‌ సగం మధ్యకు వచ్చాక మనసు మార్చుకుని, తిరిగి స్ట్రయికింగ్‌ ఎండ్‌కు వెళ్లాడు. అప్పటికే కోహ్లి క్రీజ్‌లోకి చేరుకోగా.. ఇషాన్‌ అతన్ని ఫాలో అయ్యాడు.

పరుగుకు వెళ్లాలా వద్దా అన్న సందిగ్దంలో ఉండిన ఇషాన్‌ చివరికి వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఇషాన్‌కు ఇంకా పిల్ల చేష్టలు పోలేదని, ప్రొఫెషనల్‌ ఆటగాడిగా ప్రవర్తించట్లేదని మండిపడుతున్నారు. రన్‌కు పిలిచి మనసు మార్చుకోవడం ఆటలో సహజమే అయినప్పటికీ.. ఇషాన్‌లో ఎక్కడా సిరీయస్‌నెస్‌ కనిపించలేదని దుమ్మెత్తిపోస్తున్నారు.

మరోసారి భారీ ఇన్నింగ్స్‌ ఆడే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఇషాన్‌ ఇదే సిరీస్‌లో రెండో వన్డేలోనూ ఇలాగే ఇమెచ్యూర్డ్‌గా బిహేవ్‌ చేశాడు. అనవసరంగా స్టంపింగ్‌కు అప్పీల్‌ చేసి పరువు పోగొట్టుకున్నాడు. అప్పుడు కూడా నెటిజన్లు ఇషాన్‌ను ఇలాగే ఆటాడుకున్నారు. ఇషాన్‌కు పిల్ల చేష్టలు ఇంకా పోలేదని పరుష పదజాలం ఉపయోగించి కామెంట్లు చేశారు. 

ఇదిలా ఉం‍టే, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. రోహిత్‌, గిల్‌ మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఆఖర్లో హార్ధిక్‌ పాండ్యా (38 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సైతం మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో భారత్‌ భారీ స్కోర్‌ చేసింది. 

Advertisement
Advertisement