Mayank Vs Lungi Ngidi: మయాంక్ అగర్వాల్ ఔట్ విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తి
Published
Mon, Dec 27 2021 9:20 AM
టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో అర్థసెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. రోహిత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్తో కలిసి తొలి వికెట్కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసి టీమిండియాను పటిష్టస్థితిలో నిలిపాడు. 37 పరుగుల వద్ద మయాంక్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక 149 బంతుల్లో 10 బౌండరీల సాయంతో 60 పరుగులు చేసిన మయాంక్.. ఎన్గిడి బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు.
ఎన్గిడి బంతిని ఆఫ్స్టంప్ లైన్ మీదుగా విసరగా ఇన్సైడ్ ఎడ్జ్ అయి మయాంక్ ప్యాడ్లను తాకింది. దక్షిణాఫ్రికా అప్పీల్కు వెళ్లగా.. అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో డీఆర్ఎస్కు వెళ్లి ప్రొటీస్ ఫలితం రాబట్టింది. అల్ట్రాఎడ్జ్లో బంతి టాప్ఎండ్ నుంచి లెగ్స్టంప్ను ఎగురగొట్టినట్లు కనిపించడంతో మయాంక్ ఔటయ్యాడు. అయితే ఈ నిర్ణయంపై టీమిండియా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బంతి అంత హైట్లో వెళ్తున్నప్పుడు అంపైర్ కాల్ తీసుకోవాల్సింది అంటూ కామెంట్స్ చేశారు.
ఇక మయాంక్ ఔటైన తర్వాతి బంతికే పుజారా గోల్డెన్ డక్ అయ్యాడు. ఇన్నింగ్స్ 40వ ఓవర్ మూడో బంతి పుజారా డిఫెన్స్ చేసే ప్రయత్నంలో బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ అయి కీగన్ పీటర్సన్ చేతిలో పడింది. ఇక సౌతాఫ్రికా గడ్డపై పుజారా గోల్డెన్ డక్ కావడం ఇది రెండోసారి. యాదృశ్చికంగా రెండుసార్లు ఎన్గిడి బౌలింగ్లోనే పుజారా ఔట్ కావడం ఇక్కడ మరో విశేషం.ఇక తొలిరోజు ఆటలో అన్ని సెషన్లలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా 3 వికెట్ల నష్టానికి 272 పరుగుల వద్ద తొలిరోజు ఆటను ముగించింది. కేఎల్ రాహుల్ 122 పరుగులు, రహానే 40 పరుగులతో ఆడుతున్నారు.