IND vs WI: భారత్-విండీస్ వన్డే సిరీస్.. అభిమానులకు నిరాశ
Published
Tue, Feb 1 2022 6:20 PM
ఫిబ్రవరి 6 నుంచి టీమిండియాతో వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. మూడు వన్డేలు అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరగనున్నాయి. కాగా ఫిబ్రవరి 6న జరగనున్న తొలి వన్డే టీమిండియాకు 1000వ మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా దృశ్యా మూడు వన్డేలకు ప్రేక్షకులను అనుమతించడం లేదని పేర్కొంది. క్లోజ్డ్ డోర్లోనే మ్యాచ్లన్నీ నిర్వహించాలనే నిర్ణయం తీసుకుంది. దీంతో మ్యాచ్ను లైవ్లో చూద్దామనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది.
ఈ మేరకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ట్విటర్లో ట్వీట్ చేసింది. ''ఫిబ్రవరి 6.. టీమిండియా క్రికెట్ చరిత్రలో మిగిలిపోనుంది. ఆరోజు టీమిండియా తన 1000వ మ్యాచ్ను ఆడనుంది. క్రికెట్ చరిత్రలోనే వెయ్యొవ వన్డే ఆడుతున్న తొలి జట్టుగా టీమిండియా నిలవనుంది. అయితే కరోనా దృశ్యా మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతించడం లేదు. క్లోజ్డ్ డోర్స్లోనే మూడు వన్డేలు జరగనున్నాయి.'' అంటూ ట్వీట్ చేసింది.
Considering the current situation, all the matches will be played behind the closed doors.
— Gujarat Cricket Association (Official) (@GCAMotera) February 1, 2022
అయితే మూడు వన్డేల అనంతరం టీమిండియా- విండీస్ మధ్య జరగనున్న టి20 సిరీస్కు మాత్రం ప్రేక్షకులు అనుమతించే అవకాశం ఉంది. ఈ మూడు టి20 మ్యాచ్లు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్నాయి. తాజాగా 75శాతం ప్రేక్షకులను మ్యాచ్లకు అనుమతించవచ్చని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా.. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.