Rohit Sharma: అప్పుడే కోహ్లిని దాటేసిన రోహిత్.. !
Published
Fri, Feb 11 2022 9:11 PM
అహ్మదాబాద్: వెస్టిండీస్తో ద్వైపాక్షిక వన్డే సిరీస్లో భాగంగా చివరిదైన మూడో వన్డేలో 96 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన టీమిండియా.. సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఇదిలా ఉంచితే, ఈ మ్యాచ్లో విజయం ద్వారా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లిని అధిగమించాడు. టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించిన 13 వన్డేల పరంగా చూస్తే రోహిత్ రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్ హోదాలో ఇది రోహిత్కు ఇది 11వ విజయం.
ఫలితంగా విరాట్ కోహ్లి రికార్డును బ్రేక్ చేశాడు రోహిత్. ఇక్కడ కోహ్లి(13 మ్యాచ్లకు కెప్టెన్ చేసిన జాబితాలో) 10 విజయాలతో ఉండగా, దాన్ని రోహిత్ సవరించాడు. ఇది టీమిండియా కెప్టెన్గా అత్యధికం. కాగా, ఆ సమయానికి ఓవరాల్గా అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో క్లైవ్ లాయిడ్(వెస్టిండీస్), ఇంజమాముల్ హక్లు 12 విజయాలతో టాప్లో ఉన్నారు.
కాగా, విండీస్తో ఆఖరి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 265 పరుగులు సాధించగా, వెస్టిండీస్ 37.1 ఓవర్లలో169 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు తలో మూడు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించారు. కుల్దీప్, దీపక్ చాహర్లు చెరో రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో శ్రేయస్(80; 111 బంతుల్లో 9 ఫోర్లు), పంత్(56; 54 బంతుల్లో 6 ఫోర్లు,1 సిక్స్)లు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. వాషింగ్టన్ సుందర్(33; 34 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), దీపక్ చాహర్(38; 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు)లు రాణించడంతో భారత్ 266 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది.