గొడవపడ్డ భారత్‌, నేపాల్‌ ఆటగాళ్లు.. తప్పు మనోడిదేనా! | Sakshi
Sakshi News home page

#INDVsNEP: గొడవపడ్డ భారత్‌, నేపాల్‌ ఆటగాళ్లు.. తప్పు మనోడిదేనా!

Published Sun, Jun 25 2023 8:24 AM

India-Nepal Footballers Ugly Fight During SAFF 2023 Match Video-Viral - Sakshi

శాఫ్‌ 2023 చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం భారత్‌, నేపాల్‌ మధ్య జరిగిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. మొన్న పాక్‌తో మ్యాచ్‌ సమయంలోనూ గొడవ జరిగిన సంగతి తెలిసిందే. 

విషయంలోకి వెళితే.. ఆట 64వ నిమిషంలో ఇండియాకు చెందిన రాహుల్‌ బెకె, నేపాల్‌ మిడ్‌ ఫీల్డర్‌ బిమల్‌ గాత్రి మగర్‌లు హెడర్‌ షాట్‌ కోసం ప్రయత్నించారు. ఇద్దరు ఒకేసారి హెడర్‌కు ప్రయత్నించడంతో మగర్‌ను తాకి రాహుల్‌ నేలపై పడిపోయాడు. ఆ వెంటనే కోపంతో పైకి లేచిన రాహుల్‌ మగర్‌ను తోసేశాడు. దీంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఇద్దరు ఎక్కడా తగ్గకపోవడంతో గొడవ చిలికి చిలికి వానగాలిలా మారిపోయింది. ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలో ఒక నేపాల్‌ ఆటగాడు భారత్‌ ఆటగాడిని కాలర్‌ పట్టి కింద పడేశాడు. 

ఇక కొట్టుకుంటారేమో అన్న తరుణంలో సునీల్‌ ఛెత్రి మగర్‌ను దూరంగా తీసుకుపోయాడు. ఈ క్రమంలో మగర్‌ ఛెత్రీవైపు చూస్తూ తప్పందా అతనిదే అంటూ అరిచాడు. సునీల్‌ మాత్రం 'ప్లీజ్‌ కామ్‌డౌన్‌' అని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే సునీల్‌ ఛెత్రీ సేన నేపాల్‌పై 2-0తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి ప్రవేశించింది. స్వదేశంలో భారత్‌కు ఇది వరుసగా 12వ విజయం కావడం విశేషం. మ్యాచ్‌లో 61వ నిమిషంలో సునీల్‌ ఛెత్రి భారత్‌కు తొలిగోల్‌ అందించగా.. నోరెమ్‌ మహేశ్‌ సింగ్‌ 70వ నిమిషంలో మరో గోల్‌ అందించాడు. ఆ తర్వాత భారత డిఫెండర్లు నేపాల్‌ ఆటగాళ్లను కట్టడి చేయడంతో ఒక్క గోల్‌ కూడా కొట్టలేకపోయింది. 

చదవండి: సెమీస్‌కు భారత్‌.. ప్రగల్బాలు పలికిన పాక్‌ లీగ్‌ దశలోనే ఇంటికి

Advertisement

తప్పక చదవండి

Advertisement