Virender Sehwag Comments On Arshdeep Singh: ఐపీఎల్-2021 సీజన్లో పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ అదరగొడుతున్నాడు. జట్టు ప్రదర్శన ఎలా ఉన్నా బౌలింగ్లో మాత్రం రోజురోజుకీ అతడు మెరుగు పడుతున్నాడు. ముఖ్యంగా రెండో అంచెలో ఆడిన నాలుగు మ్యాచ్లలో 9 వికెట్లు తీసి సత్తా చాటాడు. మొత్తంగా ఈ సీజన్లో ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడిన అర్ష్దీప్.. 7.71 ఎకానమీతో 16 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన శుక్రవారం నాటి మ్యాచ్లోనూ పంజాబ్ విజయంలో అతడు తన వంతు పాత్ర పోషించాడు. కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో మూడు కీలక వికెట్లు(శుభ్మన్ గిల్, నితీశ్ రాణా, దినేశ్ కార్తిక్) పడగొట్టాడు.
Courtesy: IPL Twitter
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అర్ష్దీప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అర్ష్దీప్ మంచి ఫామ్లో ఉన్నాడని... అతడి ప్రతిభను వినియోగించుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి సూచించాడు. ‘‘జహీర్ ఖాన్తో కలిసి పని చేశానన్న అర్ష్దీప్.. మూడు రోజుల్లోనే బంతిని ఎలా స్వింగ్ చేయాలో పూర్తిగా నేర్చేసుకున్నానని చెప్పాడు. అంత తక్కువ సమయంలోనే ఈ పని పూర్తి చేసిన ఈ ఫాస్ట్బౌలర్కు బీసీసీఐ మంచి సౌకర్యాలు కల్పించి.. శిక్షణ ఇస్తే తప్పకుండా ఇంకా మెరుగ్గా రాణిస్తాడు. తద్వారా అతడి ప్రతిభ వృథాగా పోకుండా ఉంటుంది. తను మంచి బౌలర్. ఇలాగే ఫామ్ కొనసాగిస్తే ఏదో ఒకరోజు టీమిండియాకు ఆడటం ఖాయం’’ అని క్రిక్బజ్తో పేర్కొన్నాడు. కాగా కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
స్కోర్లు: కేకేఆర్- 165/7 (20)
పంజాబ్ కింగ్స్- 168/5 (19.3)
చదవండి: Virender Sehwag: టీ20 ప్రపంచకప్లో అతడు బ్యాటింగ్ మాత్రమే చేయాలి