IPL 2022: Ahmedabad Franchise Reveal Official Name as Ahmedabad Titans - Sakshi
Sakshi News home page

IPL 2022: అహ్మదాబాద్ ఫ్రాంచైజీ పేరు ప్రకటించిన సీవీసీ క్యాపిటల్‌

Published Mon, Feb 7 2022 5:07 PM

IPL 2022: Ahmedabad Franchise Reveal Official Name As Ahmedabad Titans - Sakshi

ఐపీఎల్ 2022 సీజన్‌తో లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లక్నో ఇదివరకే జట్టు పేరుతో పాటు లోగోను సైతం ఆవిష్కరించగా.. తాజాగా సీవీసీ క్యాపిటల్ ఇవాళ తమ జట్టు పేరును "అహ్మదాబాద్‌ టైటాన్స్‌"గా ప్రకటించింది. మెగా వేలానికి కేవలం ఐదు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో సీవీసీ సంస్థ హడావుడిగా జట్టుకు నామకరణం చేసింది. జట్టు లోగోను ఆవిష్కరించాల్సి ఉంది. కాగా, బెంగళూరు వేదికగా ఐపీఎల్‌ మెగా వేలం  ఈ నెల 12, 13 తేదీల్లో జరగనున్న విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే, అహ్మదాబాద్ టైటాన్స్‌ను రూ. 5625 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన సీవీసీ క్యాపిటల్ పార్ట్‌నర్‌ గ్రూప్‌.. జట్టు కెప్టెన్‌గా టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యాను ఎంచుకుంది. ఇందుకు గాను అతనికి రికార్డు స్థాయిలో రూ. 15 కోట్లు చెల్లించింది. అలాగే రషీద్ ఖాన్‌కు 15 కోట్లు, శుభ్‌మన్‌ గిల్‌ను 8 కోట్లకు డ్రాఫ్ట్‌ చేసుకుంది. వీరితో పాటు కోచ్‌గా ఆశిష్‌ నెహ్రాను, మెంటార్‌గా గ్యారీ కిర్‌స్టన్‌ను నియమించుకుంది. 

మరోవైపు రూ.7090 కోట్లు పెట్టి లక్నో ఫ్రాంచైజీని చేజిక్కించుకున్న ఆర్‌పీఎస్ గోయింకా సంస్థ, తమ జట్టు పేరును లక్నో సూపర్‌ జెయింట్స్‌గా.. కేఎల్‌ రాహుల్‌(17 కోట్లు)ను కెప్టెన్‌గా, ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌(9.2 కోట్లు), రవి బిష్ణోయ్‌(4 కోట్లు)లను డ్రాఫ్ట్‌లుగా ఎంచుకుంది. ఈ జట్టుకు కోచ్‌గా ఆండీ ఫ్లవర్ వ్యవహరించనుండగా.. మెంటార్‌గా  గౌతం గంభీర్ నియమితుడయ్యాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు ఇటీవలే తమ లోగోను కూడా ఆవిష్కరించింది. 
చదవండి: IPL 2022: కేఎల్‌ రాహుల్‌ జట్టుకు సంబంధించి కీలక అప్‌డేట్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement