IPL 2022 Auction: K Gowtham Value Drops From Rs 9 Crore to Rs 90 Lakh - Sakshi
Sakshi News home page

IPL 2022 Auction: ఏడాదిలో తలకిందులు.. అప్పుడు 9.25 కోట్లు... ఇప్పుడు కేవలం!

Published Sun, Feb 13 2022 2:38 PM

IPL 2022 Auction: K Gowtham Value Drops From Rs 9 Crore to Rs 90 Lakh - Sakshi

ఐపీఎల్‌లో అంకెలు.. అంచనాలు తారుమారు కావడం మామూలే. టీమిండియా ప్లేయర్‌ కృష్ణప్ప గౌతమ్‌ విషయంలో ఇది మరోసారి నిరూపితమైంది. ఒక్క ఏడాదిలోనే అతడి విలువ ఆకాశం నుంచి అట్టడుగుకు పడిపోయింది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన భారత అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా గతేడాది గౌతమ్‌ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈసారి మెగా వేలంలో మాత్రం అతడికి నామమాత్రపు ధర దక్కింది.

అయితే ఇది కనీస ధర కంటే ఎక్కువ విలువే కావడం గమనార్హం. కర్ణాటక ఆల్‌రౌండర్‌ గౌతమ్‌ను గతేడాది చెన్నై సూపర్‌ కింగ్స్‌ అనూహ్యంగా రికార్డు ధర 9.25 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసింది. అయితే, ఒక్క మ్యాచ్‌ కూడా ఆడించలేదు. ఈ క్రమంలో మెగా వేలం-2022 నేపథ్యంలో సీఎస్‌కే గౌతమ్‌ను వదిలేసింది. దీంతో అతడు 50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు.

రెండో రోజు వేలంలో భాగంగా కోల్‌కతా, ఢిల్లీ అతడిపై ఆసక్తి కనబరచగా... లక్నో 90 లక్షలు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది. కాగా గతంలో 9 కోట్లు.. ఇప్పుడు 90 లక్షలకు అమ్ముడుపోవడంపై కృష్ణప్ప గౌతమ్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ‘‘అప్పుడు లక్కీగా భారీ ధర. తర్వాత టీమిండియా తరఫున అరంగేట్రం... ఇప్పుడు కూడా పర్లేదు. నీకు ఇది మంచి ధరే’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా శ్రీలంకతో వన్డే సిరీస్‌తో కృష్ణప్ప అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్‌ వేలంలో అతడు 2017లో 2 కోట్లు, 2018లో 6.20 కోట్లు, 2021లో 9.25 కోట్లు పలికాడు.

చదవండి: Rohit Sharma- Virat Kohli: కోహ్లి గురించి ప్రశ్న.. అసలేం మాట్లాడుతున్నావు అన్న రోహిత్‌ శర్మ.. వీడియో వైరల్‌

Advertisement
Advertisement