Sakshi News home page

IPL 2023: ఐపీఎల్ ఫైనల్ టికెట్ల కోసం అభిమానుల అవస్థలు.. స్టేడియం వద్ద తొక్కిసలాట!

Published Fri, May 26 2023 12:27 PM

IPL 2023: Chaos At Narendra Modi Stadium Amid Rush To Collect Print Tickets - Sakshi

ఐపీఎల్‌-2023 ఫైనల్‌ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం దగ్గర గురువారం తొక్కిసలాట చోటు చేసుకుంది. టిక్కెట్ల కోసం భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో ఈ ఘటన జరిగింది. అయితే వాస్తవానికి ఫైనల్‌కు సంబంధించిన టికెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే విక్రయించారు. ఆఫ్‌లైన్ టిక్కెట్‌ల విక్రయానికి సంబంధించి గుజరాత్‌ క్రికెట్‌ ఆసోషియేషన్‌ కూడా ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

కానీ ఆన్‌లైన్‌లో టిక్కెట్లను బుక్ చేసుకున్న వారు మాత్రం స్టేడియం బాక్స్ ఆఫీస్ వద్ద క్యూఆర్ కోడ్‌ను చూపించి తమ ఫిజికల్‌ టికెట్లను తీసుకోవాలి గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో తమ ఫిజికల్‌ టికెట్లను పొందేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియంకు తరలివచ్చారు. అయితే స్టేడియం వద్ద తక్కువ కౌంటర్‌లను ఏర్పాటు చేయడంతో ఈ గందరగోళం నెలకొంది.

ఈ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం ఫిజికల్‌ టిక్కెట్లను పొందేందుకు గురువారం(మే25) నుంచి శనివారం వరకు అవకాశం ఇచ్చారు. దీంతో గురువారం వేలాది మంది అభిమానులు తమ టిక్కెట్లు పొందేందుకు స్టేడియం బయట గుమిగూడారు.  ఒకరినొకరు తోసుకుంటూ, కింద పడుతూ అభిమానులు నానా తంటాలు పడ్డారు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో కాస్త ప్రశాంత వాతావారణం నెలకొంది.

ఇక ఇదే వేదికలో శుక్రవారం గుజరాత్‌-ముంబై మధ్య క్వాలిఫియర్‌-2 జరగనుంది. కాబట్టి అభిమానులు ఫైనల్‌ మ్యాచ్‌ ఫిజికల్‌ టిక్కెట్లు పొందే అవకాశం లేదు. దీంతో మళ్లీ శనివారం ఉద్రిక్త వాతవారణం నెలకొనే ఛాన్స్‌ ఉంది. కాగా ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కానున్నట్లు తెలుస్తోంది.  ఇక సీఎస్‌కేతో ఫైనల్లో తలపడబోయే జట్టు  ఏదో శుక్రవారం (మే 26) తేలనుంది. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్ మధ్య జరిగే రెండో క్వాలిఫయర్ విజేతతో చెన్నై ఫైనల్లో తలపడనుంది.
చదవండి: IPL 2023: నేను చూసుకుంటాను.. శ్రీలంక క్రికెటర్‌ కుటుంబానికి భరోసా ఇచ్చిన ధోని

Advertisement
Advertisement