IPL 2023: Mohammed Siraj Tops In Most Dot Balls Bowled In IPL - Sakshi
Sakshi News home page

IPL 2023: గర్జిస్తున్న సింహం 'మహ్మద్‌ సిరాజ్‌'.. అద్భుతమైన రికార్డు

Published Wed, Apr 19 2023 1:00 PM

IPL 2023: Mohammed Siraj Tops In Most Dot Balls Bowled - Sakshi

ఐపీఎల్‌-2023 ఎడిషన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. బ్యాటర్ల డామినేషన్‌ నడుస్తున్న ప్రస్తుత సీజన్‌లో సహచర పేసర్లు నిరాశపరుస్తున్నా, సిరాజ్‌ మాత్రం గర్జిస్తున్న సింహంలా రెచ్చిపోతున్నాడు. ఈ సీజన్‌లో ఆడిన 5 మ్యాచ్‌ల్లో సిరాజ్‌ తీసింది 8 వికెట్లే అయినప్పటికీ.. తన పేస్‌తో, స్వింగ్‌తో ప్రత్యర్ధులను గడగడలాడిస్తున్నాడు. ఈ క్రమంలో సిరాజ్‌ ఓ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రస్తుత ఎడిషన్‌లో ఇప్పటివరకు 20 ఓవర్లు బౌల్‌ చేసిన సిరాజ్‌.. ఏకంగా 69 డాట్‌ బాల్స్‌ వేసి, ఏ ఇతర బౌలర్‌కు సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌-2023లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో సిరాజే అత్యధిక డాట్‌ బాల్స్‌ వేసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అతని తర్వాత గుజరాత్‌ టైటాన్స్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ 20 ఓవర్లలో 65 డాట్‌ బాల్స్‌తో (10 వికెట్లు) రెండో స్థానంలో ఉన్నాడు.

చదవండి: IPL 2023: ఫిక్సింగ్‌ కలకలం.. సిరాజ్‌కు అజ్ఞాత వ్యక్తి నుంచి కాల్‌! అతడెవరో కాదు..

ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా లక్నో మార్క్‌ వుడ్‌ (16 ఓవర్లలో 48 డాట్‌ బాల్స్‌ 10 వికెట్లు), గుజరాత్‌ అల్జరీ జోసఫ్‌ (19 ఓవర్లలో 48 డాట్‌ బాల్స్‌ 7 వికెట్లు), పంజాబ్‌ అర్షదీప్‌సింగ్‌ (17 ఓవర్లలో 45 డాట్‌ బాల్స్‌ 8 వికెట్లు), గుజరాత్‌ రషీద్‌ ఖాన్‌ (20 ఓవర్లలో 45 డాట్‌ బాల్స్‌ 11 వికెట్లు) ఉన్నారు. 

ఈ రికార్డుతో పాటు సిరాజ్‌ మరో భారీ రికార్డు కూడా నెలకొల్పాడు. పవర్‌ ప్లేలో అత్యధిక డాట్‌ బాల్స్‌ వేసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ సీజన్‌లో పవర్‌ప్లేల్లో 72 బంతులు వేసిన సిరాజ్‌.. ఏకంగా 51 డాట్‌ బాల్స్‌ వేసి, పవర్‌ ప్లేలో అత్యంత క్లిష్టమైన బౌలర్‌గా ఖ్యాతి గడించాడు. ఈ సీజన్‌లో ఎకానమీ విషయంలోనూ సిరాజ్‌ స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ (రాజస్థాన్‌)తో పోటీపడుతున్నాడు.

కనీసం 20 ఓవర్లు బౌల్‌ చేసిన బౌలర్లలో అశ్విన్‌ 6.95 ఎకానమీతో అగ్రస్థానంలో ఉండగా.. సిరాజ్‌7 ఎకానమీతో రెండో ప్లేస్‌లో నిలిచాడు. ఇదిలా ఉంటే, సిరాజ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సీబీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. ఆర్సీబీ.. తమ తదుపరి మ్యాచ్‌లో రేపు (ఏప్రిల్‌ 20, మధ్యాహ్నం 3:30 గంటలకు) పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది. 

చదవండి: 14 ఏళ్ల కిందట తండ్రికి ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న అర్జున్‌ టెండూల్కర్‌

Advertisement
Advertisement