అప్పటికే అప్పుల్లో కూరుకుపోయాం.. బాకీలన్నీ తీర్చేసా! | Sakshi
Sakshi News home page

అప్పటికే అప్పుల్లో కూరుకుపోయాం.. బాకీలన్నీ తీర్చి.. అమ్మకోసం..

Published Sat, Mar 16 2024 2:00 PM

IPL 2024: Dhruv Jurel Reveals How IPL Contract Helped Him Clear Debts - Sakshi

ఐపీఎల్‌ ద్వారా వెలుగులోకి వచ్చిన క్రికెటర్లలో ధ్రువ్‌ జురెల్ ఒకడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను ఐపీఎల్‌-2022 వేలంలో రాజస్తాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసింది.

రూ. 20 లక్షల కనీస ధరకు అతడిని సొంతం చేసుకుంది. అయితే, ఆ ఏడాది మాత్రం ధ్రువ్‌ జురెల్‌కు తుదిజట్టులో చోటు దక్కలేదు. బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయినప్పటికీ సానుకూల దృక్పథంతో వేచి చూసి..గతేడాది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. 

ఐపీఎల్‌-2023 సీజన్‌లో 11 ఇన్నింగ్స్‌ ఆడిన ధ్రువ్‌ 152 పరుగులు చేశాడు. ఇక దేశవాళీ క్రికెట్‌లోనూ రాణించిన ఈ యూపీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌ సందర్భంగా అరంగేట్రం చేసి.. తనదైన ముద్ర వేయగలిగాడు.

ముఖ్యంగా రాంచిలో జరిగిన నాలుగో టెస్టులో విలువైన ఇన్నింగ్స్‌ ఆడి జట్టును గెలిపించి సత్తా చాటాడు. అయితే, చాలా మంది క్రికెటర్లలాగే ధ్రువ్‌ జురెల్‌ కూడా అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. అతడి తండ్రి కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్నారు. 

తనలాగే కొడుకును కూడా సైనికుడిని చేయాలని భావించారు. కానీ జురెల్‌ మాత్రం క్రికెటర్‌ అవుతానని పట్టుబట్టాడు. ఈ క్రమంలో అతడి తల్లి అండగా నిలిచి.. తన వద్ద ఉన్న చిన్నపాటి బంగారు వస్తువులు కూడా అమ్మేసి కిట్‌ కొనేందుకు డబ్బులిచ్చారు. ఎల్లవేళలా కొడుకుకు మద్దతుగా నిలిచారు. తండ్రి కూడా అర్థం చేసుకుని బాసటగా నిలవడంతో ధ్రువ్‌ జురెల్‌ తన కలలు నెరవేర్చుకున్నాడు.

ఇక ఇప్పుడు ఐపీఎల్‌-2024లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో గతాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘నాకు మొట్టమొదటిసారి ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ దక్కిన సమయంలో నా తల్లిదండ్రులు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు.

నేను ఆ బాకీలన్నీ తీర్చేశాను. మా అమ్మ కోసం కొన్ని నగలు కూడా కొన్నాను’’ అని ధ్రువ్‌ జురెల్‌ ఉద్వేగానికి లోనయ్యాడు. తల్లిదండ్రులు తనకోసం పడిన కష్టం వెలకట్టలేనిదని పేర్కొన్నాడు. కాగా మార్చి 22న ఐపీఎల్‌ తాజా సీజన్‌ మొదలుకానుండగా.. రాజస్తాన్‌ మార్చి 24న లక్నో సూపర్‌ జెయింట్స్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

Advertisement
Advertisement