స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి ఆన్ ఫీల్డ్లో డ్యాన్సులేయడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో అతను మైదానంలో స్టెప్పులేస్తూ కనిపించాడు. సందర్భమేదైనా సరే పాట ప్లే అయ్యిందంటే చాలు విరాట్కు పూనకం వస్తుంది. పక్కన ఎవరన్నా ఉంటే వారితో కలిసి చిందేస్తాడు. లేదంటే ఒక్కడే రెచ్చిపోతాడు. ఇలాంటి సందర్భమే తాజాగా మరోసారి వచ్చింది.
నిన్న సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా విరాట్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో స్టేడియం స్పీకర్లలో తెలుగు పాపులర్ డీజే టిల్లు పాట ప్లే అయ్యింది. ఈ పాట వినగానే కోహ్లి రెచ్చిపోయాడు. బీట్కు తగ్గట్టు స్టెప్పులేశాడు. విరాట్కు ఈ పాట ఫాస్ట్ బీట్ బాగా నచ్చినట్లుంది. ఈ సాంగ్ ప్లే అవుతున్నంత సేపు విరాట్ బాగా ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Virat Kohli dancing on Tillu Anna DJ song at Hyderabad yesterday.
- KING KOHLI IS A VIBE. ❤️🐐 pic.twitter.com/KkI3wTKdKp— Tanuj Singh (@ImTanujSingh) April 26, 2024
ఇదిలా ఉంటే, సన్రైజర్స్కు నిన్న సొంత మైదానంలో చుక్కెదురైంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ 35 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. విరాట్ (43 బంతుల్లో 51; 4 ఫోర్లు, సిక్స్), పాటిదార్ (20 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్దసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
అనంతరం 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్రైజర్స్.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లు చాలాకాలం తర్వాత కలిసికట్టుగా బౌలింగ్ చేసి సన్రైజర్స్ను ఇబ్బంది పెట్టారు.
స్వప్నిల్ సింగ్, గ్రీన్, కర్ణ్ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టగా.. విల్ జాక్స్, యశ్ దయాల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో షాబాజ్ అహ్మద్ (40 నాటౌట్), కమిన్స్ (31), అభిషేక్ శర్మ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.