ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్లో వెస్టిండీస్ మాజీ ఆటగాడు, తెలంగాణ టైగర్స్ ప్లేయర్ క్రిస్ గేల్ చెలరేగిపోయాడు. వీవీఐపీ ఉత్తర్ప్రదేశ్తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్ గేల్ సునామీ ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో 46 బంతులు ఎదుర్కొన్న యూనివర్సల్ బాస్.. 3 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేశాడు. గేల్ విధ్వంకర ఇన్నింగ్స్తో రెచ్చిపోయినప్పటికీ.. తెలంగాణ టైగర్స్ విజయం సాధించలేకపోవడం కొసమెరుపు.
వివరాల్లోకి వెళితే.. తెలంగాణ టైగర్స్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తర్ప్రదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో రికార్డు స్థాయిలో 269 పరుగులు (నాలుగు వికెట్ల నష్టానికి) చేసింది. పవన్ నేగి విధ్వంసకర శతకంతో (56 బంతుల్లో 139; 16 ఫోర్లు, 8 సిక్సర్లు), అన్షుల్ కపూర్ (45 బంతుల్లో 71; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్దశతకంతో విజృంభించారు. ఆఖర్లో కెప్టెన్ సురేశ్ రైనా (13 బంతుల్లో 27; 5 ఫోర్లు) మెరుపు వేగంతో పరుగులు చేశాడు.
Chris Gayle masterclass in the IVPL. 🔥pic.twitter.com/v3ggELI13K
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 26, 2024
అనంతరం అతి భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తెలంగాణ టైగర్స్.. క్రిస్ గేల్ రెచ్చిపోయినప్పటికీ విజయం సాధించలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 224 పరుగులు మాత్రమే చేయగలిగింది. గేల్ ఔటైన తర్వాత ఆఖర్లో శశకాంత్ రెడ్డి (39), కమలేశ్ (46 నాటౌట్) తెలంగాణను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఉత్తర్ప్రదేశ్ నిర్ధేశించిన లక్ష్యానికి తెలంగాణ 46 పరుగుల దూరంలో నిలిచిపోయింది. యూపీ బౌలర్లలో క్రిస్ మోఫు 5 వికెట్లు పడగొట్టాడు.
కాగా, ఈ ఏడాదే కొత్తగా ప్రారంభమైన ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (IVPL) ఫిబ్రవరి 23న మొదలైంది. ఈ లీగ్లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ టైగర్స్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ లీగ్లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, హెర్షల్ గిబ్స్, యూసఫ్ పఠాన్, సురేశ్ రైనా, మునాఫ్ పటేల్, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్ లాంటి స్టార్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు.