ఐదు వికెట్లతో చెలరేగిన జడ్డూ.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్‌ | Sakshi
Sakshi News home page

IND vs ENG: ఐదు వికెట్లతో చెలరేగిన జడ్డూ.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్‌

Published Sun, Feb 18 2024 4:54 PM

Jadeja five-for after Jaiswals unbeaten 214 Helps India 434 run win in Rajkot - Sakshi

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో  434  పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి భారత్‌ దూసుకెళ్లింది. ఇక 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ భారత బౌలర్ల దాటికి.. కేవలం 122 పరుగులకే కుప్పకూలింది.

భారత స్పిన్నర్‌ రవీంద్ర జడేజా 5 వికెట్లతో ఇంగ్లీష్‌ జట్టు పతనాన్ని శాసించగా.. కుల్దీప్‌ యాదవ్‌ రెండు, అశ్విన్‌  వికెట్‌ సాధించారు. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో లోయార్డర్‌ ఆటగాడు మార్క్‌ వుడ్‌(33) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 196/2తో నాలుగో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా నాలుగు వికెట్లకు 430 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో యువ ఆటగాడు యశస్వీ జైశ్వాల్‌ మరో డబుల్‌ సెంచరీతో చెలరేగాడు.

 కేవలం 231 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో తన డబుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.  ఓవరాల్‌గా 238 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్‌.. 14 ఫోర్లు, 12 సిక్సులతో 214 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. జైశ్వాల్‌తో పాటు శుబ్‌మన్‌ గిల్‌(91), అరంగేట్ర ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌(68*) అద్భుతంగా రాణించారు. ఫలితంగా ఇంగ్లండ్‌కు 557 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా నిర్ధేశించింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో సైతం భారత్‌ 445 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. 

స్కోర్‌ వివరాలు..
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 445 ఆలౌట్‌ (రోహిత్‌ 131, జడేజా 112)
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 319 ఆలౌట్‌ (బెన్‌ డకెట్‌ 153)
భారత్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌: 257/3 (యశస్వి 115 నాటౌట్‌)
ఇంగ్లండ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌: 122/10

Advertisement
Advertisement