Let's Not Be Unfair To KS Bharat: Ex Indian Captain Backs Wicket Keeper - Sakshi
Sakshi News home page

పంత్‌ లేకపోవడం తీరని లోటే.. కానీ భరత్‌ను బలిపశువును చేయొద్దు: మాజీ కెప్టెన్‌

Published Tue, Jun 20 2023 7:32 PM

Lets Not Be Unfair To KS Bharat: Ex Indian Captain Backs Wicket Keeper - Sakshi

KS Bharat: ఆంధ్ర క్రికెటర్‌, టీమిండియా వికెట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్‌కు భారత మాజీ కెప్టెన్‌ అంజుమ్‌ చోప్రా అండగా నిలిచారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌-2023లో టీమిండియా ఓటమికి అతడిని కారణంగా చూపడం సరికాదంటూ మద్దతు ప్రకటించారు. దయచేసి అతడిని బలిపశువును చేయవద్దంటూ మేనేజ్‌మెంట్‌కు విజ్ఞప్తి చేశారు.

ఆసీస్‌తో టెస్టు సిరీస్‌తో
కాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు కేఎస్‌ భరత్‌. స్టార్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ స్థానంలో వికెట్‌ కీపర్‌గా అవకాశం దక్కించుకున్న అతడు తన విధులను చక్కగా నిర్వర్తించాడు.

కానీ కొంతమంది మాత్రం అతడు బ్యాటర్‌గా పంత్‌ స్థానాన్ని భర్తీ చేయలేకపోయాడంటూ విషం చిమ్మారు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌-2023లో భరత్‌ బ్యాటింగ్‌ తీరుపై కూడా పెదవి విరిచారు.

ఏడో స్థానంలో
కాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన భరత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులకే అవుట్‌ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 23 పరుగులు చేయగలిగాడు. ఇక ఈ ప్రతిష్టాత్మక ఫైనల్లో టీమిండియా 209 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేఎస్‌ భరత్‌ బ్యాటింగ్‌ ప్రదర్శనపై అనవసరపు విమర్శల నేపథ్యంలో అంజుమ్‌ చోప్రా అతడికి మద్దతు ప్రకటించారు. జూలై 12న మొదలుకానున్న వెస్టిండీస్‌ పర్యటనకు భరత్‌ స్థానంలో ఇషాన్‌ కిషన్‌కు చోటు ఇవ్వనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పంత్‌ లేకపోవడం తీరని లోటే.. కానీ
ఈ మేరకు న్యూస్‌18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘రిషభ్‌ పంత్‌ అందుబాటులో లేకపోవడం టీమిండియాకు తీరని లోటే. కానీ అతడిని దృష్టిలో పెట్టుకుని కేఎస్‌ భరత్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించడం సరికాదు.

నిజానికి వికెట్‌ కీపర్‌గా అతడు తన బాధ్యతలను చక్కగా నెరవేరుస్తున్నాడు. తన ప్రైమరీ జాబ్‌ కూడా వికెట్‌ కీపింగే కదా! రిషభ్‌ పంత్‌ మాదిరే అతడు కూడా బ్యాటింగ్‌ అదరగొట్టాలని భావించడం పొరపాటే అవుతుంది. 

తన పని తాను చేస్తున్నాడు
భరత్‌ లోయర్‌ ఆర్డర్‌లో ఆడుతున్నాడు. వాస్తవానికి.. టాపార్డర్‌ బ్యాటింగ్‌ బాధ్యతను నెత్తినవేసుకోవాలి.. మిడిలార్డర్‌ వాళ్లకు సపోర్టుగా ఉంటుంది.. ఇక లోయర్‌ ఆర్డర్‌ వీరందరికీ తమ వంతు సహకారం అందిస్తుందంతే!! 

ఈ విషయాలను మనం కచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. అంతేగానీ బ్యాటింగ్‌ సరిగా లేదంటూ అతడిని విమర్శించడం సరికాదు’’ అని అంజుమ్‌ చోప్రా చెప్పుకొచ్చారు. వికెట్‌ కీపర్‌గా కేఎస్‌ భరత్‌ రాణిస్తున్నాడని.. అతడిని అదే కోణంలో చూడాలని విజ్ఞప్తి చేశారు. కాగా జూలై 12- ఆగష్టు 13 వరకు టీమిండియా వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఇక కోన శ్రీకర్‌ భరత్‌ ఇప్పటి వరకు భారత్‌ తరఫున 5 టెస్టులాడి 129 పరుగులు సాధించాడు. 

చదవండి: 20 లక్షలు అనుకుంటే ఏకంగా కోటీశ్వరుడయ్యాడు! జూబ్లీహిల్స్‌లో బంగ్లా, కార్లు.. తగ్గేదేలే!
టీమిండియా కొత్త కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌.. !
శుబ్‌మన్‌ గిల్‌ సంచలన నిర్ణయం! వచ్చే సీజన్‌లో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా!

Advertisement
Advertisement