'ప్రపంచకప్ టైటిల్తో నా కెరీర్ను ముగించాలి అనుకుంటున్నా'
Published
Thu, Mar 3 2022 7:52 AM
ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 సమరానికి రంగం సిద్దమైంది. న్యూజిలాండ్ వేదికగా మెగా టోర్నమెంట్ మార్చి 4నుంచి ప్రారంభం కానుంది. మౌంట్ మౌంగానుయ్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్లో అతిథ్య న్యూజిలాండ్.. వెస్టిండీస్తో తలపడనుంది. ఇక భారత్ తమ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్తో తలపడనుంది. కాగా మెగా టోర్నమెంట్ ఆరంభానికి ముందు భారత కెప్టెన్ మిథాలీ రాజ్ తన మనసులోని మాటను బయట పెట్టింది. "2000లో కూడా న్యూజిలాండ్లోనే జరిగిన ప్రపంచకప్లో ఆడాను. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇక్కడకు వచ్చాను.
"నా సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రపంచకప్ టైటిల్తో ముగించాలని కోరుకుంటున్నా. మా జట్టు సభ్యులంతా బాగా ఆడి మా ప్రణాళికలన్నీ సఫలం చేయాలని ఆశిస్తున్నా. కొన్ని సిరీస్ల ముందు మా జట్టు బాగా ఆడలేదనేది వాస్తవం. అయితే ప్రపంచకప్ సమయానికి అన్నీ చక్కదిద్దుకున్నాం. ప్రపంచకప్ గెలిస్తే మా ఆటగాళ్లందరికీ స్వదేశంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మమ్మల్ని చూసి అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా స్ఫూర్తి పొందాలని కోరుకుంటున్నాం" అని మిథాలీ విలేకరుల సమావేశంలో పేర్కొంది. ఇక మిథాలీ రాజ్కు ఇది 6వ వన్డే వరల్డ్ కప్. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్గా ఆమె నిలవనుంది.