IND vs ENG 4th Test: Bails Gets Stuck In Rishabh Pant's Keeping Gloves, Watch Hilariously Match Interrupted Video - Sakshi
Sakshi News home page

Rishab Pant: అరె పంత్‌.. బెయిల్‌ నీ గ్లోవ్స్‌లోనే ఉంది

Published Sat, Mar 6 2021 12:03 PM

Match Interrupted After Bail Gets Stuck In Rishabh Pant Gloves - Sakshi

అహ్మదాబాద్‌: మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌ ఉన్నంతసేపు తన సహచర ఆటగాళ్లకు ఎంటర్‌టైన్‌ చేయడంలో ఢోకా ఉండదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో రోజు ఆటలో సెంచరీతో మెరిసి టీమిండియా ఆధిక్యంలోకి వచ్చేలా చేశాడు. అంతేకాదు ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ సమయంలో కీపింగ్‌లో మెరుపులు మెరిపిస్తూ పంత్‌ చేసిన యాక్షన్‌కు కోహ్లి ఇచ్చిన రియాక్షన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ సమయంలోనే పంత్‌కు తెలియకుండా జరిగిన ఒక పని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇన్నింగ్స్‌ 43వ ఓవర్లో ఓలీ పోప్‌ మిడ్‌ వికెట్‌ దిశగా షాట్‌ ఆడగా.. అక్కడే ఉన్న కోహ్లి బంతిని అందుకొని పంత్‌వైపు త్రో విసిరాడు. అయితే బంతిని అందుకోవడంలో పంత్‌ విఫలమయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌కు సిద్ధమవుతుండగా వికెట్‌పై ఒక బెయిల్‌ కనిపించలేదు. ఇది గమనించిన ఫీల్డ్‌ అంపైర్స్‌ మ్యాచ్‌ను ఆపి బెయిల్‌ వెతకడం ప్రారంభించారు. కాసపటికే భారత ఫీల్డర్లు కూడా అంపైర్లను అనుసరించారు. అయితే కోహ్లి మాత్రం పంత్‌ దగ్గరకు వచ్చి బహుశా బెయిల్‌ అతని ప్యాడ్లలో చిక్కకొని ఉంటుందని అనుకొని వెతికాడు.. కానీ అతనికి కనిపించలేదు. దీంతో పంత్‌ రోహిత్‌ శర్మ వద్దకు వచ్చి నిలబడగా.. అతని గ్లోవ్స్‌లో బెయిల్‌ తట్టుకున్నట్లు రోహిత్‌ గమనించాడు. దీంతో.. ''అరె పంత్‌.. బెయిల్‌ నీ గ్లోవ్స్‌లోనే ఉందిగా.. బయటకు తీసి అంపైర్‌కు ఇచ్చేయ్‌'' అని పేర్కొన్నాడు. అయితే పంత్‌కు బెయిల్‌ తన గ్లోవ్స్‌లో ఉన్నట్లు తెలియదు అనుకుంటా.. అందుకే కాసేపు అయోమయానికి లోనయ్యాడు.

అంపైర్‌ వచ్చి పంత్‌ దగ్గర ఉన్న బెయిల్స్‌ తీసుకొని సరిచేయడంతో ఆట తిరిగి మొదలయింది. బెయిల్‌ కనిపించకపోవడంతో కాసేపు హై డ్రామా నెలకొన్నా.. పంత్‌ చర్య నవ్వులు పూయించింది. ఈ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇక ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. 294/7 క్రితం రోజు స్కోరుతో మూడోరోజు ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 68 పరుగులు చేసి 365 పరుగులకు ఆలౌట్‌ అయింది. వాషింగ్టన్‌ సుందర్‌ 96 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగుల ఆధిక్యం సాధించింది. మూడోరోజు లంచ్‌ విరామ సమయానికి ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 6 పరుగులు చేసింది. జాక్‌ క్రాలే 5, సిబ్లీ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
చదవండి:
వైరల్‌: పంత్‌ నువ్విలా చేయకుండా ఉండాల్సింది!

పంత్‌ యాక్షన్‌.. కోహ్లి రియాక్షన్‌: వీడియో వైరల్‌

Advertisement
Advertisement