టీమిండియాతో మూడో వన్డే.. ఆ ఇద్దరు స్టార్లు వచ్చేస్తున్నారు

26 Sep, 2023 17:02 IST|Sakshi

టీమిండియాతో రేపు జరుగబోయే నామమాత్రపు మూడో వన్డేలో ఇద్దరు ఆసీస్‌ స్టార్లు రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. గాయాల కారణంగా తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మిచెల్‌ స్టార్క్‌ మూడో వన్డే బరిలో నిలువనున్నట్లు సమాచారం. వీరిద్దరూ ఇవాళ (సెప్టెంబర్‌ 26) జరిగిన నెట్స్‌ సెషన్లో పాల్గొన్నారు. స్టార్క్‌, మ్యాక్సీ రాకతో తొలి వన్డేలో ఆడిన నాథన్‌ ఇల్లిస్‌, రెండో వన్డే ఆడిన స్పెన్సర్‌ జాన్సన్‌ జట్టుకు దూరంకానున్నారు. 

ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల సిరీస్లో భాగంగా రేపు జరుగబోయే చివరి మ్యాచ్‌లో భారత్‌-ఆస్ట్రేలియా జట్లు రాజ్‌కోట్‌ వేదికగా తలపడనున్నాయి. తొలి రెండు వన్డేలు గెలిచిన భారత్‌ ఇదివరకే 2-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది. దీంతో రేపు జరుగబోయే మ్యాచ్‌ ఇరు జట్లకు వరల్డ్‌కప్‌కు ముందు ప్రాక్టీస్‌గా పరిగణించడబడుతుంది.

మరోవైపు రేపటి మ్యాచ్‌లో టీమిండియా స్టార్లు సైతం రంగంలోకి దిగనున్నారు. తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌ రేపటి మ్యాచ్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. అలాగే రెండో వన్డేకు దూరంగా ఉన్న బుమ్రా రేపటి మ్యాచ్‌ ఆడే అవకాశం ఉంది. నామమాత్రపు మ్యాచ్‌ అయినా భారత్‌ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగాలని భావిస్తుంది.

మరిన్ని వార్తలు