Chess Championship: రాజా రిత్విక్‌కు కాంస్యం  | Sakshi
Sakshi News home page

Chess Championship: రాజా రిత్విక్‌కు కాంస్యం 

Published Thu, Mar 7 2024 10:29 AM

National Rapid Chess Championship: Telangana Raja Ritwik Won Bronze - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ రాజా రిత్విక్‌ కాంస్య పతకం సాధించాడు. నాసిక్‌లో బుధవారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత 11 రౌండ్ల తర్వాత రిత్విక్‌ 8.5 పాయింట్లతో మరో ఏడుగురితో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచాడు.

అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... ఆరోణ్యక్‌ ఘోష్‌ (రైల్వేస్‌)కు రెండో ర్యాంక్, రిత్విక్‌కు మూడో ర్యాంక్‌ దక్కాయి. 9 పాయింట్లతో దీప్తాయన్‌ ఘోష్‌ (రైల్వేస్‌) విజేతగా నిలిచాడు.

రిత్విక్‌ ఆడిన 11 గేముల్లో ఏడింటిలో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. కాంస్యం నెగ్గిన రిత్విక్‌ను తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం అధ్యక్షుడు కేఎస్‌ ప్రసాద్‌ అభినందించారు. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన కార్తీక్‌ వెంకటరామన్, నూతక్కి ప్రియాంక 13వ, 14వ ర్యాంక్‌ల్లో నిలిచారు. 

సహజ శుభారంభం 
నాగ్‌పూర్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య మహిళల టర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి సహజ యామలపల్లి శుభారంభం చేసింది. బుధవారం జరిగిన సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సహజ 3–6, 6–1, 6–1తో భారత్‌కే చెందిన వైదేహి చౌదరీని ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరింది.

న్యూజిలాండ్‌తో భారత్‌ తొలి పోరు 
లుసానె (స్విట్జర్లాండ్‌): పారిస్‌ ఒలింపిక్స్‌ పురుషుల హాకీ ఈవెంట్‌ షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేశారు. పూల్‌ ‘బి’లో ఉన్న భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను జూలై 27న న్యూజిలాండ్‌తో ఆడుతుంది. ఈ మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు మొదలవుతుంది.

గత టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన భారత జట్టు తమ రెండో మ్యాచ్‌ను జూలై 29న అర్జెంటీనాతో (సాయంత్రం గం. 4:15 నుంచి)... మూడో మ్యాచ్‌ను జూలై 30న ఐర్లాండ్‌తో (సాయంత్రం గం. 4:45 నుంచి)... నాలుగో మ్యాచ్‌ను ఆగస్టు 1న బెల్జియంతో (మధ్యాహ్నం గం. 1:30 నుంచి)... ఐదో మ్యాచ్‌ను ఆగస్టు 2న ఆ్రస్టేలియా తో (సాయంత్రం గం. 4:45 నుంచి) ఆడుతుంది. 

Advertisement
Advertisement