నేడు నా కల నెరవేరింది: నీరజ్‌ చోప్రా భావోద్వేగం | Sakshi
Sakshi News home page

Neeraj Chopra: తొలిసారిగా విమానంలో.. నువ్వు సూపర్‌ భాయ్‌!

Published Sat, Sep 11 2021 12:03 PM

Neeraj Chopra Takes Parents On Their First Flight Shares Pics - Sakshi

Neeraj Chopra Takes Parents On Their First Flight: పిల్లలు ప్రయోజకులైతే తల్లిదండ్రులు అనుభవించే ఆనందమే వేరు. బిడ్డలు అత్యున్నత శిఖరాలకు చేరుకుంటే వారి సంబరం అంబరాన్నంటుంది. అదే సమయంలో తమ తమ చిన్న చిన్న కోరికలను నెరవేర్చేందుకు వారు చేసే ప్రయత్నాలు ఆ సంతోషాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. ‘గోల్డెన్‌ బాయ్‌’ నీరజ్‌ చోప్రా తన తల్లిదండ్రులకు ఇలాంటి ఆనందాన్నే అందించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో పసిడిని ముద్దాడిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా... వ్యక్తిగత విభాగంలో ఈ ఘనత సాధించిన భారత తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 

23 ఏళ్ల వయస్సులోనే ఈ రికార్డు సాధించి, తన ఎదుగులకు ఎంతగానో పాటుపడిన తల్లిదండ్రులు, కోచ్‌లు.. సాయం అందించిన ప్రభుత్వాలకు అరుదైన కానుక అందించాడు. ఇక నీరజ్‌ చోప్రా.. తాజాగా ‘తన’ చిన్నపాటి, చిరకాల కలను నిజం చేసుకున్నాడు.  తల్లిదండ్రులు సరోజ్‌ దేవి, సతీశ్‌ కుమార్‌ను తొలిసారిగా విమానం ఎక్కించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను శనివారం షేర్‌ చేసిన నీరజ్‌.. ‘‘నా కల నేడు నెరవేరింది. మొట్టమొదటి సారిగా నా తల్లిదండ్రులు విమాన ప్రయాణం చేస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదాల వల్లే ఇదంతా సాధ్యమైంది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. 

చదవండి: ‘టాటా ఏఐఏ’ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నీరజ్‌ చోప్రా

ఇక నీరజ్‌ పోస్టుకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ‘‘ఈ ఫొటోలను సేవ్‌ చేసుకోండి ఫ్రెండ్స్‌. మీరెప్పుడైనా ఒత్తిడికి లోనైనా, నిరుత్సాహానికి గురైనా ఈ ఫొటోలను చూడండి. అన్నీ చిటికెలో మాయమైపోతాయి. నువ్వు సూపర్‌ నీరజ్‌ భాయ్‌. ఈ ప్రపంచంలోని సంతోషమంతా నీ పేరెంట్స్‌ కళ్లలోనే కనిపిస్తోంది’’ అంటూ ప్రశంసిస్తున్నారు.

చదవండి: భారీ నజరానాలు, కోట్లల్లో డబ్బు.. కేవలం ఇవేనా.. అసలు సంగతి వేరే!

Advertisement
Advertisement