ఇదేమి అంపైరింగ్రా బాబు.. కళ్లు కన్పించడం లేదా? వీడియో వైరల్
Published
Thu, Feb 22 2024 8:39 AM
దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్- శ్రీలంక మధ్య మూడో టీ20 అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో శ్రీలంకపై 3 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ విజయం సాధించింది.
ఆఖరి ఓవర్లో లంక విజయానికి 19 పరుగుల అవసరమ్వగా.. 16 పరుగుల మాత్రమే చేసి ఓటమి పాలైంది. 210 పరుగుల భారీ లక్ష్యంతో దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. లంక బ్యాటర్ కమిందు మెండిస్(65 నాటౌట్) అద్భుతమైన పోరాటం కనబరిచినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.
చెత్త అంపైరింగ్..
అయితే ఈ మ్యాచ్లో అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. శ్రీలంక ఇన్నింగ్స్ కీలకమైన ఆఖరి ఓవర్లో అఫ్గాన్ పేసర్ వఫాదర్ మొమాండ్.. మెండిస్కు ఫుల్ టాస్గా సంధించాడు. అయితే ఆ బంతి మెండిస్ నడుముపై నుంచి వెళ్లింది. దీంతో హైట్ నో బాల్ కోసం మెండిస్ అప్పీల్ చేశాడు. కానీ స్క్వేర్ లెగ్ అంపైర్ హన్నిబాల్ మాత్రం అది ఫెయిర్ డెలివరీ అంటూ చెప్పుకొచ్చాడు.
కనీసం థర్డ్ అంపైర్ కైనా రిఫర్ చేయక పోవడం గమనార్హం. ఈ క్రమంలో మెండిస్ డీఆర్ఎస్ కావాలని పట్టుబట్టాడు. అయితే రూల్స్ ప్రకారం నో బాల్ విషయంలో డీఆర్ఎస్ను పరిగణలోకి తీసుకోరు. అనంతరం రిప్లేలో క్లియర్గా అది హైట్ నోబాల్గా తేలింది.
ఈ క్రమంలో అంపైర్పై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చెత్త అంపైరింగ్.. కళ్లు కన్పించడం లేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అది నోబాల్గా ఇచ్చి వుంటే కచ్చితంగా శ్రీలంక గెలిచి ఉండేదని మరి కొంత మంది అభిప్రాయపడుతున్నారు. చదవండి: పాక్ బ్యాటర్ విధ్వంసం.. కేవలం 11 బంతుల్లోనే? వీడియో వైరల్