Once All Teammates Were Friends Now They Are: R Ashwin Shares Harsh Reality - Sakshi
Sakshi News home page

ఒకప్పుడు అందరూ స్నేహితులే.. కానీ ఇప్పుడు! ఎవరూ సాయం చేయరు: అశ్విన్‌ షాకింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

Published Mon, Jun 19 2023 4:11 PM

Once All Teammates Were Friends Now They Are: R Ashwin Shares Harsh Reality - Sakshi

Ravichandran Ashwin Shocking Comments: ‘‘ఒకప్పుడు జట్టులోని ఆటగాళ్లంతా స్నేహితుల్లా మెలిగేవారు. కానీ.. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కేవలం సహచర ఆటగాడిగానే పరిగణింపబడతాడు. అప్పటికీ.. ఇప్పటికీ చాలా తేడా ఉంది. డ్రెసింగ్‌రూం వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి.

ప్రతి ఒక్కరు అనుక్షణం పక్క వాళ్లతో పోటీ పడుతూ ముందుకు సాగాల్సిన పరిస్థితి. ‘‘హాయ్‌ బాస్‌.. ఏంటి సంగతులు?’’ అని పక్కవాళ్లతో సరదాగా మాట్లాడేందుకు ఎవరి దగ్గరా కాస్తైనా సమయం లేదు’’ అని టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు.

ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లంతా కేవలం కొలీగ్స్‌ మాదిరే ఉంటున్నారని, మునుపటిలా ఫ్రెండ్స్‌లా కొనసాగే పరిస్థితి లేదన్నాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ సైకిల్‌ 2021-23లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఈ టీమిండియా బౌలర్‌కు ఫైనల్లో ఆడే అవకాశం మాత్రం రాలేదు.

అత్యుత్తమ బౌలర్‌కు మొండిచేయి
ఇంగ్లండ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మేనేజ్‌మెంట్‌ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. 

ఇక.. ఆసీస్‌తో ఫైనల్లో టీమిండియా ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. వరుసగా రెండోసారి తుదిపోరుకు అర్హత సాధించినప్పటికీ ట్రోఫీ గెలవలేక చతికిలపడింది. ఇదిలా ఉంటే.. అశ్విన్‌ తాజాగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డ్రెసింగ్‌రూం వాతావరణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఎవరికి వారే యమునా తీరే.. ఒంటరి ప్రయాణం
జట్టులోని ఇతర సభ్యుల నుంచి సహకారం ఎలా ఉంటుందన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లు ఉంటారని అశూ పేర్కొన్నాడు. ‘‘నిజానికి.. ఎంత ఎక్కువగా ఆట గురించి చర్చిస్తే అంత ఎక్కువగా టెక్నిక్‌ను మెరుగుపరచుకునే అవకాశం ఉంటుంది. 

ఒకరి అనుభవాలు మరొకరికి పాఠాలుగా పనికివస్తాయి. కానీ ఇపుడు అలాంటి పరిస్థితి లేదు. మనకు ఏదైనా సాయం కావాలంటే ఎవరూ ముందుకురారు. పది మందితో కూడిన ఒంటరి ప్రయాణం లాంటిది ఇది’’ అని అశ్విన్‌ చెప్పుకొచ్చాడు. అయితే, క్రికెట్‌లో ఒకరు చెప్పే పాఠాల కంటే సొంతంగా నేర్చుకోవాల్సిందే ఎక్కువగా ఉంటుందంటూ ముక్తాయింపు ఇచ్చాడు. 

మేటి బౌలర్‌గా ఎదిగిన అశూ
కాగా రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌బ్రేక్‌ స్పిన్నర్‌ అయిన ఈ తమిళనాడు బౌలర్‌.. తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటి వరకు 92 టెస్టులు, 113 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మేటి బౌలర్‌గా ఎదిగిన అతడు టెస్టుల్లో 474, వన్డేల్లో 151, టీ20లలో 72 వికెట్లు పడగొట్టాడు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన అశ్విన్‌ తాజా వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

చదవండి: 2011 ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్‌ డ్రైవర్‌గా.. ఒక్కడే కాదు!
సచిన్‌, ధోని, కోహ్లి, రోహిత్‌.. రుతురాజ్‌ కూడా వీళ్ల బ్యాచ్‌లో చేరిపోయాడు..!

Advertisement
Advertisement