Pakistani Journalist Trolled for Claiming Shaheen Afridi World Go for 200 Crore at IPL Auction - Sakshi
Sakshi News home page

IPL 2022: వేలంలో పాక్ బౌలర్ కు 200 కోట్లు.. ఆశకు హద్దు ఉండాలంటున్న నెటిజన్లు 

Published Wed, Feb 16 2022 4:47 PM

Pak Journalist Trolled For Saying Shaheen Afridi Would Have Earned 200 Crores In 2022 IPL Auction - Sakshi

చాలా కాలంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సరిగ్గా లేనందున ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. ఎప్పుడో  ఐసీసీ టోర్నీల్లో తప్పించి మధ్యలో ఇరు దేశాలు తలపడింది లేదు. భారత్, పాక్ లను కలుపుకుని నాలుగు దేశాల టీ20 టోర్నీ అంటూ పాక్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) హడావుడి చేసినప్పటికీ బీసీసీఐ దాన్ని కొట్టి పారేసింది.


ఇక క్యాష్ రిచ్ లీగ్ (ఐపీఎల్) విషయానికొస్తే.. పాక్ ఆటగాళ్లను ఎప్పటి నుంచో దూరం పెట్టింది బీసీసీఐ. ఐపీఎల్ లో తమకు ప్రవేశం లేదన్న అక్కసును పాక్ ఆటగాళ్లతో సహా ఆ దేశ మీడియా సైతం చాలా సందర్భాల్లో బాహాటంగానే వెళ్లగక్కింది. తాజాగా ఐపీఎల్ 2022 మెగా వేలం ముగిసిన నేపథ్యంలో ఓ పాక్ జర్నలిస్ట్ తమ దేశ క్రికెటర్ ను ఆకాశానికెత్తుతూ చేసిన ట్వీట్ ఒకటి నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది.  


పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రిది ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొన్నట్లయితే 200 కోట్లకు అమ్ముడుపోయేవాడంటూ అత్యుత్సాహంతో ట్వీటాడు పాక్ కు చెందిన ఇతిషమ్ ఉల్ హక్ అనే జర్నలిస్ట్. ఈ ట్వీట్ ను చూసిన భారత క్రికెట్ అభిమానులు సదరు పాక్ విలేకరిని  ఓ రేంజ్ లో ఆటాడుకుంటున్నారు. ఐపీఎల్ వేలంలో ఓ జట్టు ఖర్చు చేసేది 90 కోట్లే అయితే.. మీ పాకీ బౌలర్ కి ఎక్కడి నుంచి తెచ్చి 200 కోట్లు ఇచ్చేదంటూ సెటైర్లు వేస్తున్నారు. ఆశకు ఓ హద్దుండాలి భయ్యా అంటూ చురకలంటించే కామెంట్లు చేస్తున్నారు.


మరికొందరైతే.. పాక్ ప్రధాని చైనాకు రుణమాఫీ చేయడానికి షాహిన్ అఫ్రిదిని ఉపయోగిస్తే మంచిదని సూచనలిస్తున్నారు. కాగా, ఇటీవల కాలంలో షాహీన్ అఫ్రిది అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ లో టీమిండియాతో జరిగిన మ్యాచ్ లోనూ రెచ్చిపోయాడు. కొత్త బంతితో అద్బుతంగా స్వింగ్ రాబట్టే ఈ యంగ్ పేసర్ పై పాక్ అభిమానులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటివరకు 21 టెస్టులు, 28 వన్డేలు, 39 టీ20 మ్యాచ్ లు ఆడిన షాహీన్..184 వికెట్లు పడగొట్టాడు. 


ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగిన ఐపీఎల్ 2022 మెగావేలంలో చాలా మంది క్రికెటర్లు రాత్రికిరాత్రి కోటీశ్వరులైపోయారు. ఈసారి వేలంలో స్టార్ క్రికెటర్లతో పాటు అనామకులపై కూడా కనక వర్షం కురిసింది. వేలంలో మొత్తం 204 మందిపై  10 ఫ్రాంచైజీలు ఏకంగా 552 కోట్లు ఖర్చు చేశాయి. టీమిండియా వికెట్ కీపర్/బ్యాటర్ ఇషాన్ కిషన్ వేలంలో జాక్ పాట్ కొట్టేశాడు. అతన్ని ముంబై ఇండియన్స్  రూ. 15.25 కోట్లకు దక్కించుకుంది. ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయింది ఇతనే. 
చదవండి: పాత గొడవను గుర్తుచేసి కౌంటర్‌ ఇద్దామనుకున్నాడు.. బెడిసికొట్టింది

Advertisement
Advertisement