Asain Games 2023: టీమిండియా స్టార్ భావోద్వేగం.. జాతీయ గీతం ఆలపిస్తూ కంటతడి!
Published
Tue, Oct 3 2023 12:27 PM
తమిళనాడు యువ ఆల్రౌండర్ సాయి కిషోర్ భారత జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆసియా క్రీడలు-2023లో భాగంగా నేపాల్పై సాయి కిషోర్ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో సాయి కిషోర్ తన తొలి మ్యాచ్లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతాలాపన సమయంలో తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు.
జాతీయ గీతం ప్రారంభం కాగానే సాయి కిషోర్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా సాయి తన తొలి మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన సాయి కిషోర్ 25 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్లో నేపాల్పై 23 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.
ఈ విజయంతో ఏషియన్ గేమ్స్ సెమీఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్(100) సెంచరీతో చెలరేగగా.. ఆఖరిలో రింకూ సింగ్(37 నాటౌట్ ), శివమ్ దుబే(25 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.
అనంతరం 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లతో చెలరేగగా.. అర్ష్దీప్ రెండు, సాయి కిషోర్ ఒక్క వికెట్ సాధించారు. చదవండి: వంట గదిలో నిద్రపోయేవాళ్లం.. మార్కెట్లో స్నాక్స్ అమ్మేవాడిని: పాక్ స్టార్ ఆటగాడు
Emotions aplenty as Sai Kishore swelled up during the national anthem of 🇮🇳, making his T20I debut today 🆚🇳🇵