Ravindra Jadeja Likes Controversial Post About Feeling Pain, Trauma in CSK Under Dhoni Captaincy - Sakshi
Sakshi News home page

IPL 2023 CSK VS DC: వివాదాస్పద ట్వీట్‌కు లైక్‌ కొట్టిన జడేజా.. లోలోపల బాధ నిజమేనా..?

Published Thu, May 11 2023 7:14 PM

Ravindra Jadeja Likes Controversial Post About Feeling Pain, Trauma In CSK Under Dhoni Captaincy - Sakshi

చెపాక్‌ స్టేడియంలో నిన్న (మే 10) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో (16 బంతుల్లో ఫోర్‌, సిక్స్‌ సాయంతో 21 పరుగులు, 4-0-19-1) అదరగొట్టిన రవీంద్ర జడేజాకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ప్రస్తుత సీజన్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న జడ్డూకు ఇది మూడో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు కావడం విశేషం. మ్యాచ్‌ అనంతరం అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా జడ్డూ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు, తదనంతరం జరిగిన ఓ పరిణామం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. 

ఇంతకీ జడ్డూ ఏమన్నాడంటే.. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్న తర్వాత జడ్డూ మాట్లాడుతూ.. ఏడో స్థానంలో నేను బ్యాటింగ్‌కు రాగానే ప్రేక్షకులు నిరాశ చెందినట్లున్నారు. మహీ భాయ్‌ నామస్మరణ స్టేడియం మార్మోగింది. ఒకవేళ నేను ఎక్కువ సేపు క్రీజులో ఉండి వుంటే.. వీడు ఎప్పుడు అవుట్‌ అవుతాడా అని జనాలు ఎదురు చూసేవారేమో అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. 

సొంత జట్టు అభిమానులే ఎప్పుడెప్పుడు ఔటవుతాడా అని ఎదురు చూస్తుంటే ఎంత బాధ..
మ్యాచ్‌ అనంతరం జడేజా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాజ్‌కుమార్‌ అనే ఓ ట్విటర్‌ యూజర్‌ ఓ వివాదాస్పద పోస్ట్‌ చేయగా, దానికి జడ్డూ లైక్‌ కొట్టడం ప్రస్తుతం  చర్చనీయాంశంగా మారింది. 

రాజ్‌కుమార్‌ ట్వీట్‌లో ఏముందంటే.. తాను ఎప్పుడెప్పుడు ఔటైతానా అని అభిమానులు ఎదురుచూశారని జడేజా నవ్వుకుంటూ చెప్పిన మాటల్లో లోలోపల చాలా బాధ దాగి ఉంది. నమ్మండి ఆ బాధ ట్రామా లాంటిది. సీజన్‌లో మూడు సార్లు  మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలిచి కూడా సొంత జట్టు అభిమానులే ఎప్పుడెప్పుడు ఔటవుతాడా అని ఎదురుచూడటం చాలా బాధాకరం. బాగా రాణిస్తున్నప్పటికీ కూడా ఫ్యాన్స్‌ మద్దతు లభించకపోతే ఆ బాధ వర్ణణాతీతం అంటూ రాజ్‌కుమార్‌ ట్వీట్‌ చేశాడు. ఈ వివాదాస్పద ట్వీట్‌కే జడ్డూ లైక్‌ కొట్టాడు.     

జడ్డూ ఈ ట్వీట్‌కు లైక్‌ కొట్టడంతో అభిమానుల్లో రకరకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. సీఎస్‌కేతో జడ్డూ సంతృప్తిగా లేడా.. లేక ధోనికి లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకపోతున్నాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొందరేమో ఈ విషయంలో నిజం లేకపోలేదని, అడపాదడపా ప్రదర్శన చేసే వారికే, తమ ముందు ఇంకొకరిని పొగిడితే సరిపోదని, అలాంటిది బాగా ఆడుతూ కూడా సొంత అభిమానులే తొందరగా ఔటవ్వాలని కోరుకుంటే ఏ ఆటగాడికైనా బాధ ఉంటుందని అంటున్నారు.

చదవండి: 'నేను చేసేది సరైనదే.. ఎక్కువగా పరిగెత్తించకండి'

Advertisement
Advertisement