Ind vs Pak: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌! సిగ్గులేనితనానికి నిదర్శనం అంటూ.. | Sakshi
Sakshi News home page

Asia Cup: అభిమానులకు గుడ్‌న్యూస్‌! సిగ్గుండాలి.. ఛీ.. మరీ ఇంత అన్యాయంగా! నెటిజన్స్‌ ఫైర్‌

Published Fri, Sep 8 2023 9:22 PM

Ridiculous Shameless Reserve Day Only For Ind vs Pak Fans Reacts - Sakshi

Asia Cup 2023- India vs Pakistan: భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌కు క్రికెట్‌ ప్రపంచంలో ఉన్న క్రేజ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే! దాయాదులు తలపడుతున్నాయంటే క్రికెట్‌ ప్రేమికులంతా టీవీల ముందు కూర్చోవాల్సిందే..! ఇక గత కొంతకాలంగా మేజర్‌ ఈవెంట్లలో మాత్రమే ఎదురుపడుతున్న చిరకాల ప్ర్యతర్థుల మ్యాచ్‌ను నేరుగా చూడాలంటే జేబుకు చిల్లు తప్పదు!

అయినప్పటికీ... తగ్గేదేలే అంటూ ఫ్యాన్స్‌ లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చినా వెనక్కితగ్గడం లేదు. అలాంటిది ఆసియా కప్‌-2023లో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో పోటీపడుతుందనగానే అంతా ఎంతో ఆసక్తిగా సెప్టెంబరు 2 నాటి మ్యాచ్‌ కోసం ఎదురుచూశారు.

అభిమానుల ఆశలపై నీళ్లు
అయితే.. శ్రీలంకలోని పల్లెకెలెలో జరిగిన మ్యాచ్‌కు వరణుడు ఆటంకం కలిగించాడు. హోరాహోరీ తప్పదంటూ కళ్లప్పగించి చూస్తున్న అభిమానుల ఆశలపై నీళ్లు కుమ్మరించాడు. టీమిండియా ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత ఎడతెరిపిలేని వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దైపోయింది.

మరోసారి భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌
ఈ నేపథ్యంలో కొలంబో వేదికగా సూపర్‌-4 దశలో మరోసారి టీమిండియా- పాకిస్తాన్‌ పోటీకి సిద్ధమయ్యాయి. అయితే, ఇక్కడ కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు. వాన మరోసారి దాయాదుల పోరుకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది.

వేదిక మారలేదు..
ఈ క్రమంలో వేదికను హోంబన్‌టోటకు మారుస్తారని వార్తలు వచ్చినా.. కొలంబోలోనే నిర్వహిస్తామని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ స్పష్టం చేసింది. అయితే, మళ్లీ వర్షం ఆటంకం కలిగిస్తే పరిస్థితి ఏంటని అభిమానులు ఆందోళన పడుతున్న తరుణంలో ఓ శుభవార్త వచ్చింది. 

టిక్కెట్లు పడేయొద్దు.. ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌
సెప్టెంబరు 10 నాటి భారత్‌- పాక్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే ఉంటుందని ఆతిథ్య శ్రీలంక క్రికెట్‌ బోర్డు ప్రకటన చేసింది. వరణుడు అడ్డుపడితే సోమవారం మ్యాచ్‌ పూర్తిచేసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. ఈ మ్యాచ్‌ కోసం టిక్కెట్లు కొన్నవారు అసౌకర్యానికి గురికాకుండా ఉండాలంటే.. మరుసటి రోజు కూడా వాటిని అట్టిపెట్టుకోవాలని విజ్ఞప్తి చేసింది.

సిగ్గులేని తనానికి నిదర్శనం
శ్రీలంక బోర్డు చెప్పిన వార్త అభిమానులకు సంతోషాన్నిచ్చినా.. నెటిజన్లు మాత్రం ఈ విషయంపై మండిపడుతున్నారు. కేవలం ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్‌ డే ఉండటం దేనికి సంకేతమని ఫైర్‌ అవుతున్నారు. మిగతా క్రికెట్‌ బోర్డు సభ్యులను పిచ్చోళ్లం చేయడమే ఇది అంటూ ఫైర్‌ అవుతున్నారు. 

ఆసియా కప్‌ నిర్వహణ ఒక పెద్ద బూటకంగా మారిపోయిందని.. కేవలం రెండు జట్ల కోసం ఇలాంటివి చేయడం అన్యాయమంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ‘‘శ్రీలంక- బంగ్లాదేశ్‌ మధ్య కూడా కీలక మ్యాచ్‌ జరగాల్సి ఉంది. కానీ కేవలం Ind vs Pak మ్యాచ్‌ కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం. ఛీ.. ఇంత వివక్ష ఎందుకు? సిగ్గులేనితనానికి నిదర్శనం’’ అని నెటిజన్స్‌ ట్రోల్‌ చేస్తున్నారు.

చదవండి: ‘సారా’లతో ప్రేమాయణం: శుబ్‌మన్‌కు సచిన్‌ స్పెషల్‌ విషెస్‌.. పోస్ట్‌ వైరల్‌!

Advertisement
Advertisement