David Miller: చిన్నారి మరణం.. శోకసంద్రంలో డేవిడ్ మిల్లర్!
Published
Sun, Oct 9 2022 8:20 AM
సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. క్యాన్సర్తో పోరాడుతూ శనివారం మరణించిన చిన్నారితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మిల్లర్ ఒక వీడియోనూ షేర్ చేశాడు.'' మై లిటిల్ రాక్స్టార్.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా'' అంటూ క్యాప్షన్ జత చేశాడు.
అయితే చనిపోయిన ఆ చిన్నారి డేవిడ్ మిల్లర్ కూతురేనంటూ వార్తలు వస్తున్నాయి. క్యాన్సర్తో పోరాడుతూ మరణించిందని కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. వాస్తవానికి ఆ చిన్నారి డేవిడ్ మిల్లర్ కూతురు కాదని.. అతడి స్నేహితుడి కూతురు అని మరికొందరు పేర్కొన్నారు. ట్విటర్లోనూ ఒక అభిమాని ఇదే అంశంపై స్పందిస్తూ.. ''చనిపోయింది డేవిడ్ మిల్లర్ కూతురు కాదని.. ఆమె అతడి క్లోజ్ ఫ్రెండ్ కూతురు'' అని ట్వీట్ చేశాడు. అయితే ఆ చిన్నారి మిల్లర్కి వీరాభిమాని కావడం.. పాపతో ఉన్న అనుబంధం కారణంగా డేవిడ్ అతను ఎమోషన్కు గురయ్యాడని తెలుస్తోంది.
టీమిండియాతో వన్డే సిరీస్లో భాగంగా ప్రస్తుతం డేవిడ్ మిల్లర్ ఇక్కడే ఉన్నాడు. ఒకవేళ చనిపోయింది తన కూతురు అయితే సౌతాఫ్రికాకు తిరుగు ప్రయాణమవుతున్న విషయాన్ని కచ్చితంగా చెప్పేవాడు. కానీ అలాంటి ప్రకటన ఏదీ రాలేదు కనుక ఆ చిన్నారి డేవిడ్ మిల్లర్ కూతురు కాకపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా క్యాన్సర్తో పోరాడుతూ తనువు చాలించిన చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని మనం దేవుడిని కోరుకుందాం.
ఇక కిల్లర్ మిల్లర్గా పేరు పొందిన డేవిడ్ మిల్లర్ ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యున్నత ఫామ్ను కనబరుస్తున్నాడు. టి20 సిరీస్ను టీమిండియాకు కోల్పోయినప్పటికి ఆఖరి టి20లో మెరుపు సెంచరీతో అదరగొట్టిన మిల్లర్.. అదే ఫామ్ను తొలి వన్డేలోనూ చూపెట్టాడు. ఇక రాంచీలో ఇవాళ భారత్-సఫారీల మధ్య రెండో వన్డే జరగాల్సి ఉంది. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా విజయం సాధించి సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. కాగా మిల్లర్ పెట్టిన పోస్టుతో సౌతాఫ్రికా జట్టులో విషాద ఛాయలు అలముకున్నాయి.