Sanath Jayasuriya: 53 ఏళ్ల వయసులో అదరగొట్టాడు.. లంక లెజెండ్స్‌ ఘన విజయం

14 Sep, 2022 10:42 IST|Sakshi

రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ 2022లో భాగంగా మంగళవారం ఇంగ్లండ్‌ లెజెండ్స్‌పై శ్రీలంక లెజెండ్స్‌ ఘన విజయం సాధించింది. 53 ఏళ్ల వయసులోనూ సనత్‌ జయసూర్య(4-2-3-4) తన స్పిన్‌ మాయజాలంతో ప్రత్యర్థి ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టాడు.  4 ఓవర్లు వేసిన జయసూర్య రెండు మెయిడెన్లు సహా కేవలం మూడు పరుగుల్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.అతని స్పిన్‌ ధాటికి ఇంగ్లండ్‌ లెజెండ్స్‌ 19 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది.

ఇంగ్లండ్‌ లెజెండ్స్‌ బ్యాటర్స్‌లో ఇయాన్‌ బెల్‌ 15 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. మస్టర్డ్‌ 14 పరుగులు చేశాడు. లంక బౌలింగ్‌లో సనత్‌ జయసూర్య 4 వికెట్లతో చెలరేగగా.. చమర డిసిల్వా, కులశేఖర చెరో రెండు వికెట్లు తీయగా.. ఇసురు ఉడానా, జీవన్‌ మెండిస్‌ తలా ఒక వికెట్‌ తీశారు. కాగా లంక జట్టులో ఏడుగురు బౌలింగ్‌ చేయడం విశేషం.

అనంతరం 79 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి లంక లెజెండ్స్‌ 14.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. దిల్షాన్‌ మునవీరా 24, ఉపుల్‌ తరంగ 23, తిలకరత్నే దిల్షాన్‌ 15 పరుగులు చేశారు. చివర్లో జీవన్‌ మెండిస్‌ 8 పరుగులు నాటౌట్‌ చేసి జట్టును గెలిపించాడు. కాగా స్పిన్‌ మాయాజాలంతో 4 వికెట్లు తీసిన జయసూర్య ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

మరిన్ని వార్తలు