Sakshi News home page

సంజూ శాంసన్‌కు భారీ జరిమానా

Published Thu, Apr 11 2024 11:45 AM

Sanju Slapped With Hefty Fine For Code Of Conduct Breach IPL 2024 - Sakshi

IPL 2024 GT vs RR: ఓటమి బాధలో ఉన్న రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. ఐపీఎల్‌ నిర్వాహకులు అతడికి రూ. 12 లక్షల మేర జరిమానా విధించారు. కాగా సొంత మైదానం జైపూర్‌లో రాజస్తాన్‌ బుధవారం గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడిన విషయం తెలిసిందే.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆఖరి బంతికి గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ రషీద్‌ ఖాన్‌ ఫోర్‌ బాది తమ జట్టును గెలిపించాడు.

ఫలితంగా ఐపీఎల్‌-2024 ఆరంభం నుంచి వరుసగా నాలుగు విజయాలు నమోదు చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ విజయపరంపరకు బ్రేక్‌ పడింది. అయితే, ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకుంది.

ఓవర్‌ రేటు విషయంలో నిర్దిష్ట సమయానికి ఐదు నిమిషాలు వెనుకబడి ఉండటంతో చివరి ఓవర్‌లో సర్కిల్‌ బయట ఓ ఫీల్డర్‌ను తక్కువగా ఉంచాల్సి వచ్చింది. ఫలితంగా స్వేచ్ఛగా బ్యాట్‌ ఝులిపించగలిగిన గుజరాత్‌ బ్యాటర్లు విజయానికి బాటలు వేసి.. పని పూర్తి చేశారు.

ఇక స్లో ఓవర్‌ రేటు కారణంగా రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌కు పనిష్‌మెంట్‌ ఇచ్చారు ఐపీఎల్‌ నిర్వాహకులు. ‘‘ఐపీఎల్‌-2024లో జైపూర్‌లోని సవాయి మాన్‌ సింగ్‌ స్టేడియం వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో.. స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసిన కారణంగా రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌కు  జరినామా విధిస్తున్నాం’’ అంటూ రూ. 12 లక్షలు ఫైన్‌ వేసింది. 

ఇది మొదటి తప్పిదం కావున ఈ మొత్తంతో సరిపెడుతున్నట్లు వెల్లడించింది. కాగా ఈ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఒకసారి(రూ. 12 లక్షలు), ఢిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ రెండుసార్లు(24 లక్షలు, తుదిజట్టులోని ఆటగాళ్ల ఫీజులో 25 శాతం/ఆరు లక్షలు) జరిమానా బారిన పడ్డారు.

చదవండి: #ShubmanGill: కొరకరాని కొయ్యలా సంజూ.. అంపైర్‌తో గొడవపడ్డ గిల్‌

Advertisement
Advertisement