1992 ODI World Cup: Story Behind Wasim Akram Got Biryani Before Finals - Sakshi
Sakshi News home page

T20 WC Final: ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ ఫైనల్‌.. బిర్యానీ కథ తెలుసుకోవాల్సిందే

Published Sun, Nov 13 2022 12:24 PM

Story Behind Wasim Akram Got Biryani Before Final 1992 ODI World Cup - Sakshi

అది 1992వ సంవత్సరం. పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌ మధ్య మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఫైనల్‌ మ్యాచ్‌. ఆ మ్యాచ్‌లో అప్పటి పాక్‌ ఫాస్ట్‌బౌలర్‌ వసీం అక్రమ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ముందు బ్యాటింగ్‌లో 33 పరుగులు చేసిన అక్రమ్‌.. ఆ తర్వాత బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను శాసించాడు.

అలా ఇమ్రాన్‌ ఖాన్‌ కెప్టెన్సీలో పాకిస్తాన్‌ తొలిసారి వరల్డ్‌కప్‌ను ముద్దాడింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన వసీం అక్రమ్‌ మాట్లాడుతూ.. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి తిన్న బిర్యానీ వల్లే ఈ ప్రదర్శన అంటూ సరదాగా కామెంట్‌ చేశాడు. అక్రమ్‌ మాటలు విన్న ఇప్తికర్‌ షా అనే వ్యక్తి తెగ సంతోషపడిపోయాడు.ఇఫ్తికర్‌ షా అంత సంతోషపడడానికి కారణం ఏంటో తెలుసా.. అక్రమ్‌ తిన్న బిర్యానీ ఈయన తయారు చేసిందే.

అప్పటికే ఇప్తికర్‌ షా ఆస్ట్రేలియాకు వలస వెళ్లి 10 సంవత్సరాలైంది. 1992 వన్డే వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తుందని తెలియగానే.. తన స్వంత దేశమైన పాకిస్తాన్‌ ఆటగాళ్లకు బిర్యానీ రుచి చూపించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అక్రమ్‌ ఇప్తికర్‌ను తన వద్దకు పిలుపించుకొని బిర్యానీ చేసి పెట్టాలని ఆర్డర్‌ వేశాడంట. అక్రమ్‌ మాటలకు తెగ సంతోషపడిపోయిన ఇప్తికర్‌ ఎంతో ప్రేమతో బిర్యానీ తయారు చేసి అక్రమ్‌ సహా పలువురు ఆటగాళ్లకు రుచి చూపించాడు. 

కట్‌చేస్తే సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత అదే పాకిస్తాన్‌ జట్టు మెల్‌బోర్న్‌ వేదిగా ఆదివారం(నవంబర్‌ 13న) ఇంగ్లండ్‌తో టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడనుంది.  కొన్ని గంటల్లో మొదలుకానున్న ఫైనల్లో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఫైనల్‌ మ్యాచ్‌కు ముందురోజు అంటే శనివారం పాక్‌ ఆటగాళ్లు మెల్‌బోర్న్‌లోని షా మింట్‌ అండ్‌ యునివర్సిటీ ఫుడ్‌ స్ట్రీట్‌కు వెళ్లారు. అక్కడ తమకు ఇష్టమైన బిర్యానీ తిని ఇప్తికర్‌ షాను సంతోషపెట్టారు. 

1992లో పాకిస్తాన్‌ వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన సమయంలో ఇప్తికర్‌ షా బిర్యానీ తినే తాను ఈ ప్రదర్శన చేసినట్లు అక్రమ్‌ అప్పట్లో మీడియాకు తెలపడం బాగా వైరల్‌ అయింది. అందుకే తాజాగా టి20 ప్రపంచకప్‌లో ఫైనల్‌ చేరిన పాక్‌ సెంటిమెంట్‌ ప్రకారం ఇప్తికర్‌ షా వద్దకు వచ్చి బిర్యానీ తిని వెళ్లారు. ఇక మ్యాచ్‌లో విజయం తమదేనని పాక్‌ జట్టు బలంగా నమ్ముతుంది. ఇది నిజమవుతుందో లేదో తెలియదు కానీ పాక్‌ ఆటగాళ్ల వల్ల తన బిర్యానీకి మంచి పేరు వచ్చిందని ఇఫ్తికర్‌ షా  తెగ సంతోషపడుతూ పేర్కొన్నాడు.

చదవండి: T20 WC 2022: ఫైనల్‌కు ముంగిట ఇంగ్లండ్‌ జట్టుకు బ్యాడ్‌ న్యూస్‌

Advertisement
Advertisement