T20 World Cup: Australia women to take revenge for men's Test series defeat - Sakshi
Sakshi News home page

T20 WC 2023: ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటారా? టీమిండియా పటిష్ట జట్టు: ఆసీస్‌ కెప్టెన్‌

Published Thu, Feb 23 2023 9:32 AM

WC Ind Vs Aus: Meg Lanning On Take Revenge For Men Test Defeat - Sakshi

ICC Womens T20 World Cup 2023 - AusW vs IndW: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్‌-2023 సెమీస్‌ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. భారత జట్టుపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యారా అంటూ ఓ విలేకరి ఆమెను ప్రశ్నించారు. భారత్‌లో టీమిండియా- ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని వరల్డ్‌కప్‌ మ్యాచ్‌తో ముడిపెట్టి ప్రశ్నలు సంధించారు.

ఆ సిరీస్‌ గురించి ఇక్కడెందుకు? అయినా..
భారత్‌లో ఆస్ట్రేలియా పురుషుల జట్టుకు టీమిండియా చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోబోతున్నారా అని అడిగారు. ఇందుకు బదులుగా.. ‘‘ఓహ్‌.. ఆ సిరీస్‌ గురించి ఇక్కడ మాట్లాడకూడదు. మా జట్టు అక్కడ అత్యుత్తమ రాణించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది.

పూర్తిస్థాయిలో సన్నద్ధమై వందకు వంద శాతం న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తోంది. వాళ్లకు మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది. రెండు టెస్టులు ముగిశాయి. అయితే, వాళ్లు మెరుగ్గానే ఆడారు. మిగిలిన వాటిలో మంచి ఫలితాలు రాబట్టే అవకాశం ఉంది’’ అని మెగ్‌ లానింగ్‌ పేర్కొంది. 

ప్రతీకారం తీర్చుకునేందుకు!
కాగా సౌతాఫ్రికాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌- ఆస్ట్రేలియా గురువారం నాటి తొలి సెమీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. గతంలో రెండుసార్లు(ప్రపంచకప్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌)లో ఫైనల్‌ పోరులో భారత మహిళా జట్టు ఆసీస్‌ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

అయితే, ఈసారి సమిష్టిగా రాణించి కంగారూల ఫైనల్‌ అవకాశాలు గల్లంతు చేసి ప్రతీకారం తీర్చుకోవాలని హర్మన్‌ప్రీత్‌ సేన పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌కు ఈ మేర ప్రశ్న ఎదురైంది. దీంతో ఆమె పైవిధంగా స్పందించింది.

టీమిండియా పటిష్ట జట్టు
ఇక సెమీ ఫైనల్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘టీమిండియా పటిష్ట జట్టు. రెండు జట్లు పరస్పరం ఎన్నోసార్లు పోటీపడ్డాయి. వాళ్ల జట్టులో వరల్డ్‌క్లాస్‌ క్రికెటర్లు, ఒంటిచేత్తో మ్యాచ్‌ మలుపు తిప్పగల ప్లేయర్లు ఉన్నారు. 

అలాంటి ఉత్తమ జట్టుతో పోటీ పడేందుకు మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అత్యుత్తమంగా రాణించి విజయం సాధించాలని కోరుకుంటున్నాం’’ అని మెగ్‌ లానింగ్‌ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే.. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 మొదటి రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

ప్రపంచకప్‌ సెమీ ఫైనల్‌- తుది జట్లు (అంచనా
భారత్‌: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్ ), స్మృతి మంధాన, షఫాలీ, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, పూజ, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్‌. రేణుక. 
ఆస్ట్రేలియా: మెగ్‌ లానింగ్‌ (కెప్టెన్‌), బెత్‌ మూనీ, అలీసా హీలీ, ఎలీస్‌ పెర్రీ, ఆష్లే గార్డ్‌నర్, తాలియా మెక్‌గ్రాత్, గ్రేస్‌ హారిస్, జార్జియా, అలానా కింగ్, మేగన్‌ షుట్, డార్సీ బ్రౌన్‌. 

చదవండి: Virat Kohli: కోహ్లిపై ఐస్‌లాండ్‌ క్రికెట్‌ ట్వీట్‌.. పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే.. ఫ్యాన్స్‌ ఫైర్‌
Ind Vs Aus: పాపం గిల్‌ ఎందుకు ఎదురుచూడాలి? మరి సంజూ మాటేమిటి?

Advertisement
Advertisement