Pele: భారత్తో అనుబంధం... నాడు సాకర్ మేనియాలో తడిసిముద్దయిన నగరం
Published
Sat, Dec 31 2022 11:13 AM
Pele Visit India 3 Times: బ్రెజిల్ దిగ్గజం పీలేకు భారత్తో చక్కని అనుబంధమే ఉంది. కెరీర్లో, అనంతరం బిజీబిజీగా ఉండే పీలే మూడు సార్లు భారత పర్యటనకు వచ్చాడు. ముందుగా 1977లో కలకత్తా (ఇప్పటి కోల్కతా)కు వచ్చిన పీలే... న్యూయార్క్ కాస్మోస్ టీమ్ తరఫున మోహన్ బగాన్ క్లబ్ జట్టుతో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడాడు. ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్లో ఈ మ్యాచ్ జరిగింది.
పీలే రాకతో కలకత్తా సాకర్ ప్రియుల ఆనందానికి అవధుల్లేవ్! సాకర్ మేనియాలో నగరం తడిసిముద్దయ్యింది. అనంతరం మళ్లీ 2015లోనూ ఇక్కడికొచ్చాడు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సహ యజమానిగా ఉన్న అట్లెటికో డి కోల్కతా క్లబ్కు చెందిన కార్యక్రమానికి పీలే హాజరయ్యాడు.
గంగూలీతో, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, విఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్లతో కలసి ఈవెంట్లో పాల్గొన్నాడు. అక్కడి నుంచి ఢిల్లీకి పయనమైన పీలే.. స్కూల్ విద్యార్థులతో ఫుట్బాల్ ఆడాడు. ‘భారతీయ చిన్నారులతో ప్రపంచ ప్రఖ్యాత క్రీడ ఫుట్బాల్ ఆడటం ఎంతో ఆనందంగా ఉంది’ అని ఈ సందర్భంగా అన్నాడు. 2018లో కూడా పీలే వచ్చినప్పటికీ ఓ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో పాల్గొని ఎలాంటి హడావుడి చేయకుండా వెళ్లిపోయాడు.