అరంగేట్ర మ్యాచ్‌లోనే అదుర్స్‌.. ఆర్సీబీ జట్టుతో! ఎవరీ శుభా సతీష్? | Who Is Satheesh Shubha? What Special Feat Did She Achieve On Her Test Debut, Know Interesting Facts About Her - Sakshi
Sakshi News home page

Who Is Satheesh Shubha: అరంగేట్ర మ్యాచ్‌లోనే అదుర్స్‌.. ఆర్సీబీ జట్టుతో! ఎవరీ శుభా సతీష్?

Published Fri, Dec 15 2023 12:32 PM

Who Is Satheesh Shubha? What Special Feat Did She Achieve On Her Test Debut - Sakshi

శుభా సతీష్.. భారత మహిళల క్రికెట్‌లో ప్రస్తుతం మార్మోగుతున్న పేరు. ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైకతో భారత్‌ తరపున అంతర్జాతీయ అరంగ్రేటం చేసిన శుభా.. తన అద్భుత ప్రదర్శనతో అందరిని అకట్టుకుంది. తన తొలి మ్యాచ్‌తోనే భారత మహిళల క్రికెట్‌లో చరిత్ర సృష్టించింది. టెస్టు క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ చేసిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా శుభా రికార్డులకెక్కింది.

కేవలం 49 బంతుల్లోనే శుభా సతీష్ హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకుంది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 76 బంతులు ఎదుర్కొన్న శుభా 13 ఫోర్లతో 69 పరుగులు చేసింది. అయితే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతుందన్న భయం ఎక్కడ కూడా శుభా ఇన్నింగ్స్‌లో కన్పించలేదు. అంతేకాకుండా ఇంగ్లండ్‌ వంటి పటిష్ట జట్టు బౌలర్లకు ఆమె చుక్కలు చూపించింది.

స్మృతి మంధాన, షఫాలీ వర్మ వంటి స్టార్‌ ఆటగాళ్లు విఫలమైన చోట శుభా.. అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌ 428 పరుగుల భారీ స్కోర్‌ చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఇక అరంగేట్రంలోనే అదరగొట్టిన శుభా సతీష్‌ను భారత మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ సైతం ప్రశంసించింది. ఈ క్రమంలో ఎవరీ శుభా సతీష్ అని నెటిజన్లు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు.
 

ఎవరీ శుభా సతీష్?
24 ఏళ్ల శుభా సతీష్ మైసూర్‌లోని ఓ మిడిల్‌క్లాస్‌ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శుభాకు తన చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. ఈ క్రమంలో ఆమె తండ్రి కూడా తనకు సపోర్ట్‌గా నిలిచి భారత జట్టు జెర్సీ ధరించడంలో కీలక పాత్ర పోషించాడు. 2014 చివరిసారిగా భారత మహిళ జట్టు స్వదేశంలో టెస్టు మ్యాచ్‌ ఆడేటప్పుడు శుభా సతీష్‌ అప్పుడప్పుడే క్రికెట్‌ మెళుకులు నేర్చుకుంటుంది.

అప్పటికి శుభా సతీష్ వయస్సు కేవలం 15 ఏళ్ల మాత్రమే. అయితే యాదృచ్చికంగా మళ్లీ  తొమ్మిదేళ్ల తర్వాత భారత్ తమ తదుపరి స్వదేశీ టెస్టు మ్యాచ్‌తో శుభా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టింది. కాగా ఆమె అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదగడంలో కోచ్‌ రజత్‌ది కూడా ముఖ్య పాత్ర. మైసూరులోని బౌలౌట్ క్రికెట్ అకాడమీలోనే క్రికెటర్‌గా సతీష్ ఓనమాలు నేర్చుకుంది. ఈ అకాడమీలో కోచ్‌ రజత్‌ ఆమెను ఒక మంచి క్రికెటర్‌గా తీర్చిదిద్దాడు.

కాగా దేశీవాళీ క్రికెట్‌లో కూడా శుభా సతీష్‌కు మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. మహిళల సీనియర్ వన్డే ట్రోఫీ 2021-22 సీజన్‌లో  కర్ణాటక తరపున సెకెండ్‌ లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా శుభా నిలిచింది. ఏడు మ్యాచ్‌ల్లో 43.83 సగటుతో 263 చేసింది. దేశీవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తుండడంతో ఆమెకు తొలిసారి మహిళల ప్రీమియర్‌ లీగ్‌ కాంట్రాక్ట్‌ దక్కింది. డబ్ల్యూపీఎల్‌-2024 సీజన్‌కు సంబంధించిన వేలంలో సతీష్‌ను రూ.10 లక్షలకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సొంతం చేసుకుంది.
చదవండివరల్డ్‌కప్‌లో కుదరలేదు.. ఈసారి సిరాజ్‌ సాధించేశాడు! పాపం రింకూ..

Advertisement
Advertisement