Ind vs Eng: ‘సిరాజ్‌ను తప్పించి.. అతడి స్థానంలో..’ | Sakshi
Sakshi News home page

Ind vs Eng: రోహిత్‌ కూడా చెప్పాడు..! తుదిజట్టులో సిరాజ్‌ అవసరమా?

Published Tue, Jan 30 2024 3:57 PM

Why Not Play An Extra Pure Batter: Parthiv Patel on Siraj Place in Playing XI - Sakshi

India vs England, 2nd Test - Visakhapatnam: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు భారత తుదిజట్టు కూర్పుపై మాజీ క్రికెటర్‌ పార్థివ్‌ పటేల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విశాఖపట్నం మ్యాచ్‌లో పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను పక్కనపెట్టాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.

కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్టు జరిగిన విషయం తెలిసిందే. ఉప్పల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్‌ సేన స్టోక్స్‌ బృందం చేతిలో 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఆ ముగ్గురూ రాణించారు
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా తరఫున ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా ఆకట్టుకోగా.. రవిచంద్రన్‌ అశ్విన్‌ మరోసారి తన స్పిన్‌ నైపుణ్యాలతో సత్తా చాటాడు. వీరితో పాటు మరో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ సైతం రాణించాడు.

మొత్తంగా అశూ ఆరు వికెట్లు తీయగా.. జడేజా 89 పరుగులు చేయడంతో పాటు ఐదు వికెట్లు పడగొట్టాడు. అక్షర్‌ 61 పరుగులు చేయడంతో పాటు మూడు వికెట్లు తీశాడు. పేసర్లలో జస్‌ప్రీత్‌ బుమ్రా ఆరు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. లోకల్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.

ఒక్క వికెట్‌ కూడా తీయలేదు
మొదటి టెస్టులో కేవలం పదకొండు ఓవర్లు బౌల్‌ చేసిన ఈ హైదరాబాదీ స్టార్‌.. ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ పార్థివ్‌ పటేల్‌ జియో సినిమా షోలో మాట్లాడుతూ.. రెండో టెస్టులో సిరాజ్‌ అవసరం ఉండకపోవచ్చని వ్యాఖ్యానించాడు.

ఈ మేరకు.. ‘‘జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉంటే సరిపోతుందనడంలో సందేహం లేదు. అయితే, రెండో టెస్టుకు టీమిండియా సన్నద్ధం కావడంలో నేను మరో కోణంలో ఆలోచిస్తున్నా.

జట్టులో అవసరమా?
టెస్టు మొత్తంలో సిరాజ్‌ను కేవలం ఏడెనిమిది ఓవర్ల పాటే బౌలింగ్‌ చేయించాలనుకుంటే జట్టులో ఉంచడం ఎందుకు? తుదిజట్టులో కుల్దీప్‌ యాదవ్‌ కంటే అక్షర్‌ పటేల్‌కు ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం అతడి బ్యాటింగ్‌ స్కిల్స్‌ అని రోహిత్‌ శర్మ స్వయంగా చెప్పాడు.

మరి సిరాజ్‌ సేవలను ఉపయోగించుకోనపుడు అతడి స్థానంలో ప్యూర్‌ బ్యాటర్‌ను తీసుకోవాలి. అదనపు బ్యాటర్‌ జట్టులోకి వస్తే బ్యాటింగ్‌ డెప్త్‌ పెరుగుతుంది. అనవసరంగా ఎవరూ జట్టులో ఉన్నారన్న భావన కలగదు’’ అని పార్థివ్‌ పటేల్‌ చెప్పుకొచ్చాడు.

కాగా తొలి టెస్టు ముగిసిన తర్వాత రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ‘‘మేము సరిగ్గా బ్యాటింగ్‌ చేయలేకపోయాం. నిజానికి వాళ్లు(బుమ్రా, సిరాజ్‌) మ్యాచ్‌ను ఐదో రోజు వరకు తీసుకువస్తారని భావించాం’’ అంటూ జట్టు ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా హైదరాబాద్‌ టెస్టు నాలుగు రోజుల్లోనే ముగిసిపోయింది. ఇక టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది.

చదవండి: Ind vs Eng: కోహ్లి వస్తే వేటు పడేది నీ మీదే! తాడోపేడో తేల్చుకో..

Advertisement
Advertisement