చరిత్ర సృష్టించిన జైశ్వాల్‌.. 92 ఏళ్లలో ఇదే తొలిసారి! | Sakshi
Sakshi News home page

IND vs ENG: చరిత్ర సృష్టించిన జైశ్వాల్‌.. 92 ఏళ్లలో ఇదే తొలిసారి! కోహ్లి రికార్డుకు ఎసరు

Published Mon, Feb 26 2024 11:01 AM

Yashasvi Jaiswal levels Virat Kohli's record in England Test series - Sakshi

టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌తో ఒకే టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా కోహ్లి రి​కార్డును యశస్వీ సమం చేశాడు. రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో జైశ్వాల్‌ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో ఇప్పటివరకు నాలుగు టెస్టులు ఆడిన ఈ ముంబైకర్‌ 655 పరుగులు చేశాడు.

అంతకుముందు కోహ్లి 2016లో ఇంగ్లండ్‌ సిరీస్‌లో 655 పరుగులు చేశాడు. అయితే ప్రస్తుత సిరీస్‌లో ఇంకొక మ్యాచ్‌ మిగిలూండడంతో కోహ్లి రికార్డు బ్రేక్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. కాగా ఈ సిరీస్‌ ఆసాంతం జైశ్వాల్‌ దుమ్ము లేపుతున్నాడు. వరుసగా రెండు డబుల్‌ సెంచరీలు చేసి సత్తాచాడు. ప్రస్తుత సిరీస్‌లో లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ​​

కాగా రాంఛీ టెస్టులో కూడా జైశ్వాల్‌ తన బ్యాట్‌కు పనిచెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగులు చేసిన ఈ యువ సంచలనం.. రెండో ఇన్నింగ్స్‌లో సైతం 37 పరుగులతో రాణించాడు.

తొలి క్రికెటర్‌గా..
ఇక ఈ సిరీస్‌లో అదరగొడుతున్న మరో అరుదైన ఘనతను కూడా జైశ్వాల్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. 92 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఒక సిరీస్‌లో 600పైగా పరుగులు చేసిన భారత మొదటి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా ఒక‌ టెస్ట్ సిరీస్‌లో 600 పైగా పరుగులు చేసిన ఐదో భారత ఆటగాడిగా జైశ్వాల్‌ నిలిచాడు.

ఈ జాబితాలో  విరాట్ కోహ్లి, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, దిలీప్ సర్దేశాయ్ వంటి  దిగ్గజాలు ఉన్నారు. ఇక రాంఛీ టెస్టులో భారత్‌ విజయం దిశగా అడుగులు వేస్తోంది. టీమిండియా తమ సిరీస్‌ విజయానికి ఇంకా 93 పరుగుల దూరంలో  నిలిచింది. ప్రస్తుతం క్రీజులో శుబ్‌మన్‌ గిల్‌(7), రవీంద్ర జడేజా ఉన్నారు.

Advertisement
Advertisement