నెల్లూరు(క్రైమ్): ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, ఎన్నికల కేసుల్లో ఉన్న నిందితులను బైండోవర్ చేశారు. లైసెన్స్డ్ ఆయుధాలను సీజ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. మద్యం అక్రమ రవాణా, అక్రమ నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించారు. వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. శనివారం సాయంత్రం నుంచి ప్రచారపర్వం ముగియడంతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం దుకాణాలను మూసివేశారు. ఎక్కడా విక్రయాలు జరగకుండా పోలీసు, సెబ్ అధికారులు చర్యలు చేపట్టారు.
● ఆత్మకూరు: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాహనాలను తనిఖీ చేస్తున్నామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆత్మకూరు ఇన్స్పెక్టర్ బి.నయనతార తెలిపారు. ఆదివారం రాత్రి నెల్లూరు – ముంబై రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. మద్యం, నగదు, నగలు లాంటివి అనుమతి పత్రాలు లేకుండా సరఫరా చేస్తుంటే స్వాధీనం చేసుకుంటామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో సెబ్ ఎస్సై కిరణ్కుమార్, సిబ్బంది ఉన్నారు.
మద్యం విక్రయాలు
జరగకుండా..
కొడవలూరు: ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కోవూరు ఎస్ఈబీ అధికారులు కొడవలూరు మండలంలో ఆదివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. నార్తురాజుపాళెం, కొడవలూరు, తాటాకులదిన్నె, పద్మనాభసత్రంలో మద్యం దుకాణాల సీలును పరిశీలించడంతోపాటు పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఈబీ సీఐ ఆర్.నరహరి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా డ్రైడే అమల్లో ఉన్నందున మద్యం విక్రయాలు జరగకుండా అన్ని గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. డ్రైడే పక్కాగా అమలు జరుగుతోందన్నారు. ఎస్ఈబీ సీఐ వెంట ఎస్సై సీ.శ్రీనివాస్, కానిస్టేబుళ్లు మస్తానయ్య, రాజు, తులసీ ఉన్నారు.
నిత్యాన్నదానానికి విరాళం
బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని జొన్నవాడలో కొలువైన మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి అమ్మవారి ఆలయంలో నిత్యాన్నదానానికి దాతలు ఆదివారం నగదు విరాళం ఇచ్చా రు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ నెల్లూరుకు చెందిన వేటూరు చంద్రశేఖర్రెడ్డి – అపర్ణమ్మ దంపతులు వారి కుటుంబసభ్యులతో కలిసి అన్నదాన పథకానికి రూ.1,07,436ను విరాళంగా ఇచ్చారన్నారు. కార్యక్రమంలో ఈఓ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.
ధాన్యాన్ని వేగంగా
కొనుగోలు చేయాలి
నెల్లూరు(అర్బన్): ఈనెల 16వ తేదీ నుంచి జిల్లాకు వర్షసూచన ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో పీపీసీల ద్వారా వెంటనే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు చిరసాని కోటిరెడ్డి కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబును కోరారు. ఈ మేరకు ఆదివారం కలెక్టరేట్లో ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోటిరెడ్డి మాట్లాడుతూ ధర తగ్గించి కొనుగోలు చేసిన వారిపై చర్యలు చేపట్టాలన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు వీలులేనందున వేగవంతంగా కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని విజ్ఞప్తి చేశారు.