ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

Published Sat, Mar 25 2023 12:14 AM

-

నెల్లూరు(క్రైమ్‌): ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని నేతాజీనగర్‌ ఆరోవీధిలో విజయబాబు(57) – సంఘమిత్ర దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి నిఖిల్‌, నితిన్‌ కుమారులు. విజయబాబు సూళ్లూరుపేట మండలంలోని ఓ పీహెచ్‌సీలో నేత్ర విభాగంలో అధికారిగా పనిచేస్తున్నారు. కుమారులిద్దరినీ హైదరాబాద్‌లో చదివిస్తున్నారు. విజయబాబు గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఈ నెల 23న రాత్రి ఆయన ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. భర్త ఎంతకీ రాకపోవడంతో సంఘమిత్ర బంధువులకు ఫోన్‌చేసింది. అందరూ కలిసి వెతుకుతుండగా పొదలకూరు రోడ్డు వాటర్‌ట్యాంకు సమీపంలోని పార్క్‌మెట్ల వద్ద విజయబాబు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించి ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం చికిత్సనిమిత్తం ఆయనను నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఎలుకలమందు తాగాడని, పరిస్థితి విషమంగా ఉందని, వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించగా కుటుంబసభ్యులు ఇంకో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్సపొందుతూ శుక్రవారం విజయబాబు మృతిచెందాడు. ఈ మేరకు మృతుడి భార్య వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం జీజీహెచ్‌ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement