నెల్లూరు(సెంట్రల్) : జిల్లాలో రబీ సీజన్లో మాత్రమే రైతులు టమాటాలను సాగు చేస్తుంటారు. అయితే వేసవి కాలంలో మాత్రం టమాటా సాగు జరగదు. కేవలం మదనపల్లి ప్రాంతంపై ఆధార పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో అధిక శాతం రైతులు టమాటాల సాగుపైనే ఎక్కువగా ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. అందువల్లే మదనపల్లి, పలమనేరు ప్రాంతాల నుంచి జిల్లాకు టమాటాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది.
సబ్సిడీపై విక్రయాలు
ప్రస్తుతం జూన్ నెల నుంచి టమాటా ధరలు భారీగా పెరిగి కిలో రూ.100 నుంచి రూ.130 వరకు చేరింది. జూలైలో మరింత పెరిగి కిలో రూ.200కు వచ్చింది. దీంతో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పేద ప్రజలపై ధరల భారం పడకుండా ఉండేందుకు సబ్సిడీపై టామాటాలను పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంది. నెల్లూరు నగరంలోని ఫత్తేఖాన్పేట, నవాబుపేటతో పాటు జిల్లాలోని కావలి, కందుకూరు రైతుబజారులో కిలో రూ.50కే విక్రయాలు చేయడం ప్రారంభించింది. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఒక రేషన్ కార్డుకు రెండు కిలోల చొప్పున విక్రయాలు చేసింది.
రూ.51 లక్షలకు పైగా సబ్సిడీ
జిల్లా ప్రజలకు సబ్సిడీపై టమాటాల విక్రయాలు చేయాలనే ఉద్దేశంతో వ్యవసాయశాఖ, మార్కెటింగ్ శాఖ ద్వారా పలమనేరు, మదనపల్లి ప్రాంతాల నుంచి కిలో రూ.110 నుంచి రూ.170 చొప్పున కొనుగోలు చేశారు. దీంతో ఇప్పటి వరకు 65 టన్నులు (65 వేల కేజీలు) జిల్లాలోని నాలుగు రైతుబజార్ల ద్వారా విక్రయాలు చేసింది. ఆయా ప్రాంతాల్లో కిలో రూ.170 వరకు కొనుగోలు చేసి సబ్సిడీపై కిలో రూ.50కే విక్రయాలు చేసింది. దాదాపుగా రూ.51 లక్షలకు పైగా ప్రభుత్వమే భరించి సబ్సిడీపై టమాటాల విక్రయాలు చేయడం గమనార్హం. ప్రస్తుతం టమాటాల ధరలు తగ్గుముఖం పట్టడంతో సబ్సిడీ టమోటాలను ప్రస్తుతానికి నిలిపివేసింది.
ఎక్కడా ఇబ్బందుల్లేకుండా..
టమాటా ధరలను కట్టడి చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకున్నాం. తమ సిబ్బంది సుదూర ప్రాంతాలకు రాత్రీ పగలూ తేడా లేకుండా నేరుగా రైతుల వద్దకే వెళ్లి టమాటాలు సేకరించి సబ్సిడీపై ప్రజలకు అందజేశాం. ప్రస్తుతం ధర తగ్గడంతో నిలిపివేశాం.
– అనిత,
వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఏడీ
ప్రభుత్వమే ఆదుకుంది
టమాటాల ధరలు అమాంతం పెరిగినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సబ్సిడీపై రూ.50 కే విక్రయాలు చేసి పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకుంది. విపత్కర సమయంలో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోంది.
– ఎన్.అశోక్కుమార్,
ప్రైవేటు ఉద్యోగి
ప్రతి ఏడాది రెండు నుంచి మూడు నెలల పాటు ఉల్లిపాయలు, టమాటాల ధరలు పెరగడం సర్వసాధారణం. ఈ పరిస్థితి
ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశం మొత్తం నెలకొంటుంది. అయితే ధరలు ఎంత పెరిగినా.. ప్రజలపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. సబ్సిడీపై టమాటాలను సరఫరా చేసింది. ప్రతి ఏటా జూన్, జూలై నెలలో టమాటాలు ధరలకు రెక్కలు వచ్చినా, ప్రభుత్వం నేరుగా రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి ప్రజలకు సబ్సిడీపై పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది కూడా సాగు తగ్గడంతో ధరలు అమాంతం పెరిగాయి. అయితే ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పేదలు లబ్ధి పొందారు.
టమాటాల ధరలు అమాంతం
పెరిగినా రూ.50కే విక్రయించిన
రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పటి వరకు జిల్లాలో
65 వేల కేజీల విక్రయాలు