నాడు జూనియర్‌ అసిస్టెంట్‌.. నేడు గ్రూప్‌–1 అధికారిణి | Sakshi
Sakshi News home page

నాడు జూనియర్‌ అసిస్టెంట్‌.. నేడు గ్రూప్‌–1 అధికారిణి

Published Fri, Aug 25 2023 11:56 PM

రుధిరను అభినందిస్తున్న మంత్రి గోవర్ధన్‌రెడ్డి  - Sakshi

పొదలకూరు: ఆమె ఒకప్పుడు జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేశారు. కష్టపడి చదివి నేడు గ్రూప్‌–1 అధికారిణిగా మారారు. కుటుంబం, ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఉంటే విజయం సొంతమవుతుందని గ్రూప్‌–1కు ఎంపికై న ఎల్‌ఎస్‌ఆర్‌ రుధిర తెలిపారు. నెల్లూరులోని కొత్తూరుకు చెందిన ఆమె శుక్రవారం సాక్షితో మాట్లాడారు. తండ్రి పద్మనాభరావు. తల్లి శాంతికుమారి. తల్లి గతంలో పొదలకూరు రెవెన్యూ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేశారు.

రుధిర పొదలకూరు మండలం వరదాపురం శ్రీసాయినాథ్‌ స్కూల్లో 2014 – 15 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివారు. తర్వాత ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీకి వెళ్లారు. 2021లో సివిల్‌ ఇంజినీరింగ్‌ పట్టా పుచ్చుకున్నారు. ఇంకా ఐజీఎన్‌ఓయూలో బీఏ పూర్తి చేశారు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే పట్టుదలతో రాష్ట్ర హైకోర్ట్‌ పెట్టిన పరీక్ష రాసి జూనియర్‌ అసిస్టెంట్‌గా ఎంపికై నెల్లూరు కోర్టులో పనిచేశారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇటీవల గ్రూప్‌–1 సాధించి ఖజానా శాఖకు ఎంపికయ్యారు.

నా లక్ష్యం ఐఏఎస్‌
శ్రీసాయినాథ్‌ స్కూల్లో కరస్పాడెంట్‌ మురళీకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్‌ శ్రీనివాసరెడ్డి విద్యార్థులను చదివించడంలో ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. ఇది నా భవిష్యత్‌కు ఎంతో ఉపయోగపడింది. పోటీ పరీక్షలు రాసేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా. ఐఏఎస్‌ కావాలన్నదే నా లక్ష్యం. ఇందుకోసం కఠోర శ్రమ పడాల్సి ఉంటుంది. పట్టుదల, కృషి ఉంటే లక్ష్యాన్ని సాధించవచ్చు. – రుధిర

1/1

Advertisement
Advertisement