ఉదయగిరి : ఉదయగిరి సెబ్ కార్యాలయ పరిధిలోని సీతారామపురం బీసీకాలనీలో సోమవారం సెబ్ జేడీ బృందం, స్థానిక సెబ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మొత్తం 155 మద్యం సీసాలతో పాటు ఆదోని ఏడుకొండలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సెబ్ ఎస్సై మురళీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ జయంతి సందర్భంగా మద్యం విక్రయాలు జరపరాదన్నారు. అయితే బీసీకాలనీలో ఓ వ్యక్తి మద్యం విక్రయాలు జరుపుతున్నాడని సమాచారం అందడంతో వారి ఆదేశాల మేరకు దాడులు నిర్వహించామన్నారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు.
వాశిలి సమీపంలో..
ఆత్మకూరు : నెల్లూరు–ముంబై రహదారిపై వాశిలి సమీపంలో ఉన్న దాబాలో 8 ఫుల్ మద్యం బాటిళ్లను ఆత్మకూరు ఎస్ఈబీ సీఐ బి.నయనతార తమ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యంతో పాటు వెంకట్, సురేష్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
నర్రవాడలో..
దుత్తలూరు : మండలంలోని నర్రవాడలో అక్రమంగా నిర్వహిస్తున్న మద్యం బెల్టుదుకాణంపై సోమవారం సెబ్ జేడీ బృందం ఎస్సై బాలకృష్ణ తన సిబ్బందితో దాడులు జరిపారు. మొత్తం 19 మద్యం సీసాలు, ఒక ఫుల్ బాటిల్ను స్వాధీనం చేసుకోవడంతో పాటు షేక్.రహీం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మద్యం సీసాలతో పాటు మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని ఉదయగిరి సెబ్ అధికారులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.