నెల్లూరు (పొగతోట): మత్స్యశాఖకు సంబంధించి సాగర మిత్ర పోస్టుల భర్తీ ప్రక్రియ నిర్వహించారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 30 పోస్టులకు 270 మంది దరఖాస్తు చేసుకోగా ఇంటర్వ్యూలకు 205 మంది హాజరయ్యారు. అధికారులు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి ఇంటర్వ్యూలు నిర్వహించారు. మెరిట్, రోస్టర్ ఆధారంగా పోస్టుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని మత్స్యశాఖ అధికారులు తెలిపారు.
2,120 హెక్టార్లలో
మొక్కల పెంపకం
● డీఎఫ్ఓ చంద్రశేఖర్
ఉదయగిరి: జిల్లాలో 2023–24 ఆర్థిక సంవత్సరానికి 2,120 హెక్టార్లలో మొక్కల పెంపకానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అటవీ శాఖాధికారి ఆవుల చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం స్థానిక అటవీ రేంజ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే 80 హెక్టార్లలో మొక్కల పెంపకం చేశామన్నారు. మిగిలిన 40 హెక్టార్లలో డిసెంబరు నాటికి మొక్కల పెంపకం పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో 354 కేసుల్లో ఉన్న పాత ముద్దాయిలను పోలీసుల సహకారంతో అరెస్ట్ చేసి చార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. వీఎస్ఎస్ల్లో సుమారు 1.70 మెట్రిక్ టన్నుల జామాయిల్ దిగుబడి ఉండగా, ఇప్పటికే 90 వేల మెట్రిక్ టన్నుల జామాయిల్ హార్వెస్ట్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓ బోగ్యం శ్రీనివాసులు, ఎఫ్బీఓ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు కాంట్రాక్ట్ పోస్టుల
తుది జాబితా
నెల్లూరు సిటీ: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్(మహిళ) పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఽఅభ్యర్థుల తుది జాబితాను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం spsne llore.ap.gov.in/notice/recruitment వెబ్సైట్లో పొందుపరచనున్నారని జిల్లా డీఎంఅండ్హెచ్ఓ పెంచలయ్య మంగళవారం ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో 12 మి.మీ
వర్షపాతం
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లావ్యాప్తంగా మంగళవారం సగటున 12 మి.మీ వర్షపాతం కురిసింది. గరిష్టంగా పొదలకూరు మండలంలో 62.4 మి.మీ వర్షపాతం నమోదైంది. వెంకటాచలంలో 55.2, సైదాపురం 52.6, రాపూరు 43.2, చేజర్ల 39.2, మనుబోలు 38.2, కలువాయి 37, అనంతసాగరం 25.4 దుత్తలూరు 23.2, ముత్తుకూరు 14.2, ఆత్మకూరు 13.6, ఉదయగిరిలో 12.2 మి.మీ వర్షపాతం నమోదైంది.
నాన్బెయిలబుల్
కేసు నమోదు
నెల్లూరు(క్రైమ్): యానాదుల సంక్షేమ సంఘం, జనసేన నేతలపై దర్గామిట్ట పోలీసులు నాన్బెయిలబుల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... మనుబోలు సెక్షన్ పరిధిలోని వీరంపల్లి విద్యుత్ సబ్స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ చిట్టేటి భానుచందర్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ యానాది సంక్షేమ సంఘం, జనసేన నేతలు ఈనెల 27వ తేదీన విద్యుత్ భవన్ ముట్టడించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో మహిళా కానిస్టేబుల్ మల్లిక కాలికి గాయమైంది.ఈ సంఘటనపై దర్గామిట్ట పోలీసులు యానా ది సంక్షేమ సంఘం నాయకుడు కేసీ పెంచలయ్య, జనసేన నాయకుడు గునుకుల కిశోర్తో పాటు మరో ఆరుమందిపై కేసు నమోదు చేశారు.
అపస్ రాష్ట్ర
సహాధ్యక్షుడిగా చక్రపాణి
కొడవలూరు: అపస్ (ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం) రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు ఆదివారం విజయవాడలో జరిగాయి. ఈ ఎన్నికల్లో మండలం లోని నాయుడుపాలెం ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎం.చక్రపాణి రాష్ట్ర సహాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన్ను అపస్ మండల శాఖ నాయకులు సీహెచ్.శ్రీనివాసులు, మణికంద్రాచారి, ఏవీ.రంగారావు అభినందించారు.