హిందూపురం: పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్ పొందుతున్న విద్యార్థులు వెంటనే తమ బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం చేయించుకోవాలని సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారి శివరంగప్రసాద్ మంగళవారం ప్రకటనలో సూచించారు. బ్యాంకు అకౌంట్కు ఆధార్ లింక్ చేసుకోకపోతే స్కాలర్షిప్ మొత్తం జమ కాదన్నారు. ఈ మేరకు ఆయా కళాశాల ప్రిన్సిపాళ్లు కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ఇంకా 1,641 మంది విద్యార్థులు ఆధార్ను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకోలేదన్నారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనకు సంబంధించిన మొత్తం కూడా విద్యార్థుల తల్లులు ఖాతాకే రాష్ట్ర ప్రభుత్వమే జమ చేస్తుందని, ఇందుకు కూడా తప్పనిసరిగా తల్లుల బ్యాంకు ఖాతా ఆధార్తో అనుసంధానం చేయాలన్నారు. జిల్లాలో 238 మంది తల్లులు ఖాతాలు ఆధార్తో అనుసంధానం కాలేదన్నారు.
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
ప్రశాంతి నిలయం: ఇంటర్ పరీక్షలు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతున్నాయి. మంగళవారం 99 కేంద్రాల్లో నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 31,102 మందికి గాను, 30349 మంది హాజరయ్యారు. 753 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్కు సంబంధించి 28,919 మందికి గాను 28,250 మంది హాజరుకాగా, 669 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్కు సంబంధించి 2,183 మందికి గాను 2,099 మంది హాజరుకాగా, 84 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.