పెనుకొండ: పట్టణంలోని దర్గాపేటకు చెందిన ఖలీల్ కుమార్తె చిన్నారి షాఫియా కనిపించక 6 రోజులవుతున్నా ఇప్పటికీ ఆచూకీ తెలియరాలేదు. స్థానికంగా బాడుగ ఇంట్లో నివసిస్తూ ఓ చిన్న హోటల్లో పనిచేయడం ద్వారా వచ్చే కూలీతో ఖలీల్ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నిరుపేదలైన తమ బిడ్డను ఎవరు తీసుకెళ్లారో అంటూ నిత్యం ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.
చిన్నారులతో కలసి ఆడుకుంటున్న షాఫియాను ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక తప్పిపోయిందా అన్నది అంతుబట్టడం లేదు. పట్టణంతోపాటు ఇతర ప్రాంతాల్లో పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించినా ఏ విషయం తెలియరాలేదు. ఓ చిన్నారిని హిందూపురంలో వ్యక్తి ఎత్తుకెళుతున్నట్లు సీసీ పుటేజీ ద్వారా తెలుస్తోందనే సమాచారం వినిపిస్తున్నా పోలీసులు ధృవీకరించడం లేదు. దర్గాపేట ప్రాంతానికి తరచూ ఇతర ప్రాంతాల భక్తులు రావడం, యాచకులు పెద్దయెత్తున సంచరించడం పరిపాటి. ఈ నేపఽథ్యంలో చిన్నారిని కిడ్నాప్ చేశారా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా చిన్నారి అదృశ్యంలో ఎలాంటి పురోగతి లేకపోవడం భయాందోళన రేపుతోంది. తమ పిల్లలను ఇంటి నుంచి బయటకు పంపాలంటే పట్టణప్రజలు జంకుతున్నారు.