పుట్టపర్తి టౌన్: శాంతిభద్రతల పరిరక్షణకు అహర్నిశలు శ్రమించే పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. శుక్రవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏఆర్ బలగాలు, స్పెషల్ పార్టీ సిబ్బంది, హోంగార్డులు, పుట్టపర్తి అర్బన్, రూరల్ ప్రాంతాల్లోని పోలీస్ సిబ్బందికి పరేడ్ నిర్వహించారు. పరేడ్ పరిశీలనకు వచ్చిన ఎస్పీ మాట్లాడుతూ, పోలీసులకు క్రమ శిక్షణ ముఖ్యమన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ పరేడ్లో పాల్గొంటూ ఫిట్గా ఉండాలన్నారు. విధి నిర్వహణలో చిన్న, చిన్న అవాంతరాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగాలన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులున్నా నేరుగా తనను కలవవచ్చన్నారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులను, బ్యాండ్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ విజయకుమార్, ఆర్ఐలు రాజశేఖరరెడ్డి, టైటస్, నారాయణతోపాటు హోంగార్డులు, స్పెషల్పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.
సమస్యలుంటే తెలపండి
పోలీస్ సిబ్బంది సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకరావాలని వారి సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్లు ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వారి సమస్యలు పరిష్కరించేందుకు శుక్రవారం పరేడ్ మైదానంలో పోలీస్ దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసుల సమస్యలు తెలుసుకొనేందుకు ఏర్పాటు చేసిన పోలీస్ దర్బార్ కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ సాయుధ బలగాలు సద్వినియోగం చేసుకొని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వీలైనంత త్వరగా వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించి పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ విజయకుమార్, ఆర్ఐలు పాల్గొన్నారు.