బాలకృష్ణపై తిరగబడుతున్న జనం | Sakshi
Sakshi News home page

బాలకృష్ణపై తిరగబడుతున్న జనం

Published Sat, Nov 18 2023 9:04 AM

ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న మహిళలు - Sakshi

హిందూపురం టౌన్‌: బాలకృష్ణ డౌన్‌ డౌన్‌.. బాలకృష్ణ గో బ్యాక్‌.. బాలకృష్ణ రాజీనామా చేయాలి.. అంటూ హిందూపురం ప్రజల నినదించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ తీరుతో విసుగెత్తిపోయిన హిందూపురం ప్రజలు ‘నువ్వు మాకొద్దు బాబోయ్‌’ అంటూ గళమెత్తారు. హిందూపురంలో శుభాకార్యానికి విచ్చేసిన బాలకృష్ణను బుధవారం రాత్రి మేళాపురం సర్కిల్‌లో ప్రజలు అడ్డుకున్నారు. ఈ ఘటన మరువక ముందే శుక్రవారం పట్టణంలోని ఆటోనగర్‌లో ప్రజలు బాలకృష్ణ డౌన్‌ డౌన్‌ అంటూ ప్లకార్డులతో నిరసనకు దిగారు. రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. చుట్టపు చూపుగా హిందూపురానికి వచ్చి వెళ్తున్న బాలకృష్ణ ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఏనాడైనా ప్రజా సమస్యలపై మాట్లాడారా అని ఆటోనగర్‌ మహిళలు ప్రశ్నించారు. ‘అసలు నీకు ఓట్లు వేసిన ప్రజలు గుర్తున్నారా? ఎన్నికలప్పుడు ఓట్ల కోసమేనా మేము కనిపించేది. నువ్వు గెలిచిన తర్వాత ఆటోనగర్‌లో ఒక్కసారైనా పర్యటించావా?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆరు నెలల తర్వాత హిందూపురానికి వచ్చిన బాలకృష్ణను కలిసి సమస్యలను విన్నవిద్దామని వెళితే కనీసం కలవనివ్వలేదని, టీడీపీ నాయకులు తమను పోలీసుల ద్వారా నెట్టి వేయించారని వాపోయారు. అసమర్థ ఎమ్మెల్యేను హిందూపురంలో గెలిపించామని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్యేగా బాలకృష్ణ అనర్హుడు

బాలకృష్ణ మా ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నాం. ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చారే కానీ తర్వాత ఇటు తిరిగి చూసిన పాపాన పోలేదు. టిడ్కో ఇళ్లకు డబ్బులు కట్టించుకుని కేటాయించకుండా మొత్తం మెక్కేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాకే ఆటోనగర్‌లో అభివృద్ధి పనులు చేస్తున్నారు.

– ముబిషిరా, ఆటోనగర్‌, హిందూపురం

ఎమ్మెల్యే పదవికి

రాజీనామా చేయాలని డిమాండ్‌

1/1

Advertisement
Advertisement