పుట్టపర్తి టౌన్: శ్రీసత్యసాయి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా జేపీకే రాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం పట్టణంలోని వాసవీ నివాస్లో సంఘ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా రామును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నాయకులు ఆయనకు పూలమాలలు, శాలువలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభ్యున్నతికి పాటుపడతానన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ విభాగం అధ్యక్షుడు కోటా సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు వంకదారి వెంకటేశ్వర్లు, నాయకులు రామ్కుమార్, మనోజ్కుమార్, వరప్రసాద్, రామ్ప్రసాద్ తదితరులున్నారు.
నేడు కలెక్టరేట్లో ‘స్పందన’
పుట్టపర్తి అర్బన్: కలెక్టరేట్లో సోమవారం జిల్లా స్థాయి ‘స్పందన’ కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ అరుణ్బాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించనున్నట్లు తెలిపారు. పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం, ధర్మవరం, కదిరి ఆర్డీఓ కార్యాలయాలు, మండల స్థాయిలోనూ ఉదయం 10 గంటలకు ‘స్పందన’ ప్రారంభమవుతుందన్నారు.
ఎస్పీ కార్యాలయంలోనూ..
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ‘స్పందన’ ఉంటుంది. ఈ మేరకు పోలీసు కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ మాధవ రెడ్డికి సమస్యలపై ఫిర్యాదు చేసుకోవచ్చు.
నేటి నుంచి ప్రపంచ
వారసత్వ వారోత్సవాలు
అనంతపురం కల్చరల్: ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకూ అనంతపురం వేదికగా ప్రపంచ వారసత్వ వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటాక్ కన్వీనర్ రామ్కుమార్, కవి రియాజుద్దీన్ ఆదివారం తెలిపారు. జిల్లా పురావస్తు, పర్యాటక శాఖలు, ఇంటాక్ సంయుక్త ఆధ్వర్యంలో వారం రోజుల పాటూ సాగే ఈ వేడుకలను సోమవారం ఉదయం ఆర్ట్స్ కాలేజ్ వద్ద హెరిటేజ్ వాక్తో కలెక్టర్ గౌతమి ప్రారంభించనున్నారు. 21న కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో పురాతన నాణేల ప్రదర్శన, 22న రోటరీ పాఠశాలలో విద్యార్థులకు తెలుగు శతక పద్య పఠన పోటీలు, 23న ఆర్ట్స్ కళాశాలలో యువతకు పద్య పఠన పోటీలు, 24న పీస్ మెమోరియల్ హాల్లో చిత్రలేఖన పోటీలు, 25న జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సీనియర్ రచయిత డాక్టర్ పతికి రమేష్ నారాయణ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం, 26న ఎస్ఎస్బీఎన్ కళాశాలలో వారోత్సవాల ముగింపు వేడుకలు ఉంటాయి. ఉమ్మడి అనంత జిల్లా చరిత్రను ప్రతిబింబించేటా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఇంటాక్ ప్రతినిధులు తెలిపారు.