చిలమత్తూరు: మండలంలోని కొడికొండ చెక్పోస్ట్ వద్ద ఉన్న రక్షా అకాడమీని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సందర్శించారు. బుధవారం ఉదయం శ్రీసత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వెళుతూ ఉదయం రక్షా అకాడమీకి చేరుకున్న ఆయనకు తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ నరేష్కృష్ణ, పరిగి తహసీల్దార్ సౌజన్యలక్ష్మి, డీఎస్పీ కంజాక్షన్ తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి, స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కాసేపు విశ్రాంతి అనంతరం తిరిగి పుట్టపర్తికి బయల్దేరి వెళ్లారు.
పోలీసు స్టేషన్ ఆవరణలో చిరుత
రొళ్ల: మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్ ఆవరణలో మంగళవారం అర్ధరాత్రి ఓ చిరుత సంచరించింది. ఆ సమయంలో సెంట్రీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ షఫీతో కలసి జమేదార్ రామలింగయ్య విధుల్లో ఉన్నారు. కుక్కల అరుపులు వినిపించడంతో బయటకు వచ్చిన వారు పోలీసుస్టేషన్ ఆవరణ నుంచి 10 మీటర్ల దూరంలో వెళుతున్న చిరుతను గమనించారు. చీకట్లో చిరుత సంచారం సీసీ ఫుటేజీల్లో నిక్షిప్తం కాలేదు. విషయాన్ని బుధవారం ఉదయం బహిర్గతం చేస్తూ చిరుత సంచారంపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచించారు. పొలాల వద్దకు వెళ్లే రైతులు జాగ్రత్తలు పాటించాలని కోరారు.