అల్లుడిపై మామ దాడి | Sakshi
Sakshi News home page

అల్లుడిపై మామ దాడి

Published Tue, Nov 28 2023 1:22 AM

-

కళ్యాణదుర్గం: ఇల్లరికం వచ్చేందుకు ఇష్టపడని అల్లుడిపై మామ దాడి చేశాడు. వివరాలు.. కళ్యాణదుర్గం మండలం కొత్తూరుకు చెందిన నరసింహులు కుమార్తె గోవిందమ్మ, కంబదూరు మండలం జక్కిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సిద్దయ్య ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ప్రస్తుతం ఓ కుమార్తె ఉంది. కొన్ని రోజుల క్రితం గోవిందమ్మ పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో తన భార్యను పిలుచుకెళ్లేందుకు ఆదివారం సిద్ధయ్య కొత్తూరుకు చేరుకున్నాడు. రాత్రి మామ నరసింహులుతో మాట్లాడుతూ తన భార్యను కాపురానికి పిలుచుకెళుతానని తెలిపాడు. దీంతో నరసింహులు తన కుమార్తెను పంపడం కుదరదని తేల్చి చెప్పాడు. అల్లుడిని కూడా తన ఇంట్లోనే ఇల్లరికం ఉండాలన్నాడు. ఇందుకు సిద్ధయ్య అంగీకరించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పక్కనే ఉన్న కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన కుటుంబసభ్యులు వెంటనే కళ్యాణదుర్గంలోని సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ఘటనపై తమకు ఎలాంటి సమాచారం లేదని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement