పిచ్చోడి చేతిలో కర్ర.. ధ్వంసమైన కార్ల అద్దాలు | Sakshi
Sakshi News home page

పిచ్చోడి చేతిలో కర్ర.. ధ్వంసమైన కార్ల అద్దాలు

Published Fri, Dec 1 2023 12:54 AM

-

యాడికి: మతిస్థిమితం లేని వ్యక్తి స్వైర విహారం చేయడంతో ఏకంగా ఐదు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. వివరాలను యాడికి ఎస్‌ఐ గురుప్రసాదరెడ్డి వెల్లడించారు. యాడికిలోని ఆస్పత్రి కాలనీలో నివాసముంటున్న వైఎస్సార్‌సీపీ సోషియల్‌ మీడియా కన్వీనర్‌ ఫరూక్‌ ఇంటి వద్ద తన రెండు కార్లతో పాటు బాబ్జీ, శ్రీకాంత్‌కు చెందిన మరో రెండు కార్లు పార్కింగ్‌ చేశారు. అదే కాలనీలో నివాసముంటున్న బాలు కూడా తన ఇంటి వద్దనే కారు పార్కింగ్‌ చేశాడు. గురువారం తెల్లవారుజామున స్థానికుడు నారాయణస్వామి కట్టెతో అటుగా వెళుతూ కార్ల అద్దాలు ధ్వంసం చేసి, ధ్రువీకరణ పత్రాలను తీసుకెళ్లి ఇంట్లో భద్రపరుచుకున్నాడు. ఉదయం ఈ విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ బొంబాయి రమేష్‌ నాయుడు, వైఎస్సార్‌సీపీ నాయకులు, పోలీసులు ఫరూక్‌ ఇంటి వద్దకు చేరుకుని ధ్వంసమైన కార్లను పరిశీలించారు. బాలు ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నారాయణస్వామిని గుర్తించి, అదుపులోకి తీసుకుని రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, నారాయణస్వామికి మతిస్థిమితం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement