పెనుకొండ రూరల్: ప్రమాదవశాత్తు రోటావేటర్ కిందపడి ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... పెనుకొండ మండలం అడదాకులపల్లికి చెందిన ఆంజనేయులు (37)కు భార్య కావేరి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం సొంతూరుకే చెందిన ఓ రైతు పొలంలో రోటావేటర్ సాయంతో భూమిని చదును చేసే పనుల్లో నిమగ్నమయ్యాడు. కుదుపులకు అదుపుతప్పి ట్రాక్టర్పై నుంచి కిందపడిన ఆంజనేయులు నేరుగా రోటావేటర్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. విషయాన్ని గమనించిన గొర్రెల కాపరులు వెంటనే సమాచారం అందించడంతో కుటుంబసభ్యులు, పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు.
అంతర్జాతీయ రోప్ జంప్ పోటీలకు నల్లమాడ విద్యార్థి
నల్లమాడ: త్వరలో జరిగే అంతర్జాతీయ రోప్ జంప్ పోటీలకు నల్లమాడకు చెందిన ఓ విద్యార్థి ఎంపికయ్యాడు. వివరాలను విద్యార్థి చదువుతున్న పాత బాలాజీ ఇంగ్లిష్ మీడియం పాఠశాల డైరెక్టర్ పోలే వెంకటరెడ్డి, కరస్పాండెంట్ స్వర్ణలత శనివారం వెల్లడించారు. తమ పాఠశాల విద్యార్థి ఎస్. తాహీర్ నవంబర్ 30 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు మహారాష్ట్రలోని శిరిడీలో జరిగిన జాతీయ స్థాయి రోప్ జంప్ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించి అంతర్జాతీయ పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. అంతేకాక విద్యార్థులు సి.బద్రీనాథ్, జయసూర్య కాంస్య పతకాలతో జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారన్నారు.
వాహనం ఢీకొని వృద్ధుడి మృతి
ధర్మవరం రూరల్: మండలంలోని సీతారాంపల్లి వద్ద శనివారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. మృతుడిని కనగానపల్లి మండలం చంద్రశ్చర్ల గ్రామానికి చెందిన నరసింహులు (75)గా పోలీసులు గుర్తించారు. శనివారం అనంతపురానికి వెళ్లేందుకు సిద్ధమైన ఆయన ఆటో కోసం జాతీయ రహదారిపై సీతారాంపల్లి క్రాస్ వద్ద వేచి ఉండగా వాహనం ఢీకొంది. మృతుడికి భార్య నరసమ్మ, ఒక కుమారుడు, ఐదుగురు కుమార్తెలున్నారు. ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.